Tirumala Hundi Collection: ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం .. ఎంతంటే?
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గత కొన్నినెలలుగా రోజురోజుకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకొనే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుతుంది.
- Harishth Thanniru
- Published On : September 10, 2022 / 02:35 PM IST
Tirumala Hundi Collection
Tirumala Hundi Collection: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గత కొన్నినెలలుగా రోజురోజుకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకొనే వారి సంఖ్య పెరుగుతోంది. వరుస సెలవులకుతోడు శ్రావణ మాసం కావడంతో ఆగస్టు నెలలో భక్తులు తిరుమలకు భారీగా తరలివచ్చారు. ఒక్క ఆగస్టు నెలలోనే 22.22 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అంటే గత నెలలో రోజుకు సగటున 71వేల మందికిపైగా స్వామివారిని దర్శించుకున్నారు.
ఆగస్టులో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవటంతో స్వామివారి హుండీ ఆదాయంసైతం రికార్డు స్థాయిలో సమకూరింది. ఆగస్టు నెలలో హుండీ కానుకలు రూ.140.34 కోట్లు వచ్చాయి. తిరుమల చరిత్రలోనే అత్యధికం ఇదే. ఆగస్టు నెలలో 1.05కోట్లు శ్రీవారి లడ్డూలు విక్రయించారు. 47.76 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. 10.85 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
TTD: గొడుగుల ఊరేగింపులో కానుకలు ఇవ్వొద్దు.. భక్తులకు టీటీడీ సూచన
ఈ ఏడాది మార్చి నెలలో శ్రీవారి హుండీకి రూ.128 కోట్లు ఆదాయం సమకూరగా, ఏప్రిల్ నెలలో రూ.127.5కోట్లు, మే నెలలో రూ. 130.50 కోట్లు, జూన్ నెలలో రూ.120 కోట్లు, జులై నెలలో రూ. 139.45 కోట్లు ఆదాయం సమకూరింది. ఆ రికార్డులను తిరగరాస్తూ ఆగస్టు నెలలో ఏకంగా 140.34 కోట్లు ఆదాయం రావటం గమనార్హం. మరోవైపు ఈ నెల 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీడీపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలో సైతం భక్తులు తాకిడి అధికంగా ఉండటంతో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది.
