Chandrababu Quash Petition : ఏం జరగనుంది? సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. మధ్యాహ్నం 1గంటకు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం తీర్పును వెల్లడించనుంది.
- Harishth Thanniru
- Published On : January 16, 2024 / 11:12 AM IST
Chandrababu Quash Petition
Skill Development Case : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. మధ్యాహ్నం 1గంటకు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం తీర్పును వెల్లడించనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై అక్టోబర్ 17న సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనేది తీర్పులో సుప్రింకోర్టు స్పష్టం చేయనుంది.
Also Read : KTR : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభ వార్తలపై స్పందించిన కేటీఆర్ .. కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక సూచన
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్ట్ చెల్లదని, అక్రమంగా అరెస్ట్ చేశారని, దర్యాప్తు, ఎఫ్ఐఆర్ పై స్టే విధించాలని హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు పిటిషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 27, అక్టోబర్ 3,9,10,13,17 తేదీల్లో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ కొనసాగింది. దాదాపు 10గంటలపాటు ఇరుపక్షాల మధ్య వాదనలు సాగాయి. సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే చంద్రబాబు తరపు వాదనలను సుప్రీంకోర్టులో వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరపు వాదనలు ముకుల్ రోహిత్గి వినిపించారు.
Also Read : MLC Kavitha: ఈడీ నోటీసులకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. విచారణకు హాజరుకాలేనని వెల్లడి
స్కిల్ డెవలప్మెంట్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ జరిగిందని, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ పరిగణనలోకి తీసుకోలేదని, రాజకీయ కక్ష సాధింపుతో అరెస్ట్ జరిగిందని, అరెస్ట్ నిబంధనలకు విరుద్ధంగా జరిగినందున కేసు , దర్యాప్తు కూడా చెల్లదంటూ సుప్రీంకోర్టు ఎదుట చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. మరోవైపు .. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ చంద్రబాబుకి వర్తించదని, నేరం జరిగిన నాటికి ఆ సెక్షన్ రాలేదని, పీసీ యాక్ట్ మాత్రమే కాక సీఆర్పీసీ, ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తరువాతనే హైకోర్టు చంద్రబాబు పిటిషన్ కొట్టివేసిందని, అవినీతి జరినట్లు అధారాలున్నాయని ఇందులో కక్ష సాధింపు లేదని చంద్రబాబు పిటిషన్ కొట్టివేయలని సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ తమ వాదనలు వినిపించింది. చట్ట సవరణకు ముందే కేసు దర్యాప్తు ప్రారంభమైనందున చంద్రబాబుకి సెక్షన్ 17ఏ రక్షణ వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.
Also Read : గెలుపు సంగతి తర్వాత, పోటీ చేయడమే ముఖ్యం.. ఏపీలో జోరుగా టికెట్ల రేస్
రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డివలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 52రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు ఆరోగ్య కారణాలతో నాలుగువారాలు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. నవంబర్ 20న అదేకేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఇదిలాఉంటే.. స్కిల్ కేసు తీర్పు పెండింగ్ లో ఉండటంతో సుప్రీంకోర్టు లో పెండింగ్ లో ఉన్న ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్లు, అదేవిధంగా.. స్కిల్ కేసులో తీర్పుతో ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు లో చంద్రబాబుపై ఉన్న కేసుల తదుపరి విచారణలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
