Nandamuri Balakrishna : ”వై నాట్ 175” అని సీఎం జగన్ ఇప్పుడంటే వినాలని ఉంది-బాలకృష్ణ
ఫలితాలతో పులివెందుల కోటకు బీటలు పడుతున్నాయన్నారు. త్వరలో ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరతాయని హెచ్చరించారు. మరోవైపు 'వై నాట్ 175' అని జగన్ అంటే ఇప్పుడు వినాలని ఉంది అని బాలయ్య అన్నారు.
- Naveen
- Published On : March 19, 2023 / 12:05 AM IST
Nandamuri Balakrishna : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. 3 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఫలితాలు ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి. ఇది ప్రజా విజయం అని, మార్పుకి సంకేతం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తనదైన శైలిలో స్పందించారు.
ఎన్నికల్లో వైసీపీని తొక్కిపట్టి నారతీశారని బాలయ్య అన్నారు. ఫలితాలతో పులివెందుల కోటకు బీటలు పడుతున్నాయన్నారు. త్వరలో ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరతాయని హెచ్చరించారు. మరోవైపు ‘వై నాట్ 175’ అని జగన్ అంటే ఇప్పుడు వినాలని ఉంది అని బాలయ్య అన్నారు. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు బాలకృష్ణ. ఏపీకి టీడీపీ పాలన ఎంత అవసరమో ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయని చెప్పారు బాలకృష్ణ.
”పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అభ్యర్ధులకు అభినందనలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత.. వైసీపీని తొక్కిపట్టి నార తీసింది. ఈ ఫలితాలు రాష్ట్రానికి టీడీపీ పాలన ఎంత అవసరమో తెలియజేస్తున్నాయి. 3 ఎమ్మెల్సీ స్ధానాల ఫలితాలతో పులివెందుల కోటకు బీటలు పడుతున్నాయి. పులివెందుల కోటకు మొదలైన బీటలు త్వరలో తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరతాయి. జగన్ తాత దిగొచ్చినా, మరో వంద మంది జగన్ లు వచ్చినా దాన్ని కాపాడుకోవటం సాధ్యం కాదు. వైనాట్ 175 అని జగన్ ఇప్పుడు అంటే వినాలని ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్ అండ్ కో ని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయం” అని బాలయ్య అన్నారు.
ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మూడింటికి మూడు స్థానాల్లో విజయభేరి మోగించింది. గత రాత్రి వెల్లడైన ఫలితాలతో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ.. తాజాగా పశ్చిమ రాయలసీమ స్థానాన్ని కూడా చేజిక్కించుకుంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7,543 ఓట్లతో ఘనవిజయం సాధించారు.
Also Read..Pithapuram Assembly constituency: పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారా?
తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో, రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను తేల్చారు. నిన్న ఆధిక్యంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఇవాళ(మార్చి 18) ఆ ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లు ఆయనకు ప్రతికూలంగా మారాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల విజయం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. “పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు. గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్. ఇది ప్రజా విజయం, మార్పునకు సంకేతం. మంచికి మార్గం… రాష్ట్రానికి శుభసూచకం” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి శాసనమండలికి వెళుతున్న వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడాలని చంద్రబాబు కోరారు. మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉంటారని ఆశించారు.
