Ushashri Charan: సమ్మె విరమించి విధులకు హాజరు కావాలి: మంత్రి ఉషశ్రీ
అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని ఉషశ్రీ అన్నారు. అర్హతను బట్టి..
- T Venkateshwarlu
- Updated on- December 21, 2023 / 04:41 PM IST
Ushashri Charan
Ushashri Charan: అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. అమరావతిలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.
తాము ఇప్పటికే ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని రూ.లక్షకు పెంచామన్నారు. ఉద్యోగ విరమణ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశామని ఉషశ్రీ అన్నారు. గతంలో తెలంగాణకు సమానంగా వేతనాలు ఇవ్వాలనని కోరిన వెంటనే రూ.11,500కు పెంచామని చెప్పారు.
పదోన్నతి వయస్సును పెంచామని ఉషశ్రీ తెలిపారు. అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని ఉషశ్రీ అన్నారు. అర్హతను బట్టి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని తెలిపారు. అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు.
సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడతాం
సీటు విషయంలో తాను ఇంతవరకు సీఎం జగన్ను కలవలేదని ఉషశ్రీ అన్నారు. ప్రజల కోసం జగన్ మరోసారి సీఎం కావాలన్నారు. పేదలకు జగన్ పాలన ఒక శ్రీరామ రక్ష అని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉంటారని తెలిపారు.
