Devi Navaratrulu 2025: అన్ని మంత్రాలకు మూలం గాయత్రీదేవి.. పూజిస్తే మంత్రశక్తితో పాటు బ్రహ్మజ్ఞానం.. ఈ మంత్రం జపించండి..
గాయత్రీ మంత్రం జపిస్తే ఆనందంతో పాటు మంచి ఆలోచనలు, ఆత్వవిశ్వాసం పెంపొందుతాయి.
- T Venkateshwarlu
- Updated on- September 23, 2025 / 07:34 AM IST
Devi Navaratrulu 2025
Devi Navaratrulu 2025: శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిలో రెండవ రోజు అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. గాయత్రీదేవి అమ్మవారు అన్ని మంత్రాలకు మూలం. అమ్మవారిని పూజిస్తే మంత్రశక్తితో పాటు బ్రహ్మజ్ఞానం కలుగుతాయి.
గాయత్రీ దేవి అనంత శక్తి స్వరూపిణి. ప్రాతఃకాలంలో అమ్మవారు గాయత్రిగా, మధ్యాహ్న వేళలో సావిత్రిగా, సంధ్య సమయంలో సరస్వతిగా పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం.. గాయత్రీ దేవి ముఖంలో అగ్ని కొలువై ఉంటారు. అమ్మవారి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువై ఉంటారు. అమ్మవారిని పూజిస్తే బుద్ధి, తేజస్సు మరింత పెరుగుతాయి. (Devi Navaratrulu 2025)
గాయత్రీ దేవి మంత్రం
ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఈ మంత్రం పఠిస్తే చతుర్వేదాలు పఠించిన ఫలితాన్ని అందుకుంటామని హిందువులు నమ్ముతారు. అంతేకాదు, సకల దేవతలను ప్రార్థించినట్లేనని రుగ్వేదంలో ఉంది. ఈ మంత్రం జపిస్తే ఆనందంతో పాటు మంచి ఆలోచనలు, ఆత్వవిశ్వాసం పెంపొందుతాయి. ప్రతిరోజు గాయత్రి మంత్రం పఠించడం వల్ల విజయాలు దక్కుతాయి. ఈ మంత్రం పఠించినవారి ఆరోగ్యం బాగుండడంతో పాటు వారి ఏకాగ్రత పెరుగుతుంది.
గాయత్రీదేవి అమ్మవారిని నారింజ రంగు చీరతో అలంకరిస్తారు. అమ్మవారి స్త్రోత్రాలు పారాయణ చేస్తారు. తామర పూవులతో గాయత్రీదేవిని పూజిస్తారు. ఎర్రటి గాజులు దానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి.
