8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు బిగ్ అలర్ట్.. 8వ కేంద్ర వేతన సంఘం (CPC) కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనవరి 2025లో కమిషన్ సూత్రప్రాయంగా ఆమోదం పొందినప్పటికీ, అధికారిక నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదు. నోటిఫికేషన్ రిలీజ్ తర్వాత కమిషన్ చైర్పర్సన్ సభ్యులను అధికారికంగా నియమిస్తారని నివేదిక వెల్లడించింది.
అతి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ :
ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (8th Pay Commission) రాజ్యసభకు తెలియజేశారు. “8వ కేంద్ర వేతన సంఘానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపారు. ఒకసారి కమిషన్ ఏర్పడిన తర్వాత కమిషన్ చైర్పర్సన్, సభ్యులను నియమిస్తారని ఆయన అన్నారు.
తుది ప్రకటనకు ముందు ఏకాభిప్రాయం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారిక నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏంటి ?
8వ వేతన సంఘం కింద జీతం, పెన్షన్ సవరణలో అత్యంత కీలకమైన అంశం ఫిట్మెంట్ ఫ్యాక్టర్.. సవరించిన జీతం, పెన్షన్ను లెక్కించేందుకు వాడుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కొత్త జీతం = ప్రాథమిక జీతం × ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఈసారి, ప్రభుత్వం డాక్టర్ వాలెస్ అక్రాయిడ్ అభివృద్ధి చేసిన అక్రాయిడ్ ఫార్ములాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కనీస వేతనాలను జీవన వ్యయానికి తగినట్టుగా ఉంటుంది. ఈ ఫార్ములా ప్రకారం.. ఆహారం, దుస్తులు, గృహనిర్మాణం వంటి ముఖ్యమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎలా నిర్ణయిస్తారంటే? :
ప్రస్తుతం, డియర్నెస్ అలవెన్స్ (DA) 58శాతం వద్ద ఉంది. 8వ వేతన సంఘం అమలు అయ్యే సమయానికి 60శాతానికి చేరుకుంటుందని అంచనా. దీని ఆధారంగా, బేస్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.60 ఉండే అవకాశం ఉంది. అయితే, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వం 10శాతం నుంచి 30శాతం వరకు పెంచవచ్చు. 20శాతం పెంపుదల అంటే 1.92కి పెరుగుతుంది. అలాగే 30శాతం పెంపుదల అంటే.. 2.08కి చేరుతుంది. 8వ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.8 నుంచి 2.08 మధ్య ఉండవచ్చు. ఫలితంగా ఉద్యోగులు జీతాలు, పెన్షన్లు భారీగా పెరుగుతాయి.
రాబోయే కమిషన్ ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, ఆదాయం ఆధారంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అక్రాయిడ్ ఫార్ములా వర్తిస్తే.. కనీస వేతనాలు నిత్యావసరాలకు అనుగుణంగా ఉంటాయని అంటున్నారు. కమిషన్ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ తర్వాత కేంద్రం కొందరిని నియమిస్తుంది. ఒక చైర్పర్సన్, ఇద్దరు ఫుల్ టైమ్ సభ్యులు, ఇతర పార్ట్-టైమ్ నిపుణుల సలహాదారులు ఉంటారు.
ఒకసారి ఏర్పాటైన తర్వాత కమిషన్ సిఫార్సులను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించేందుకు దాదాపు 18 నెలల సమయం ఇవ్వవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ ప్రకటన కోసం ఎంతకాలంగా ఎదురుచూస్తున్నారు. లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్మెంట్ చేసిన వారికి జనవరి 1, 2026 నుంచి కొత్త వేతన స్కేల్ అమలు చేయాలని అనేక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.