Dubai Multiple-Entry Visa : భారతీయ పర్యాటకుల కోసం దుబాయ్ మల్టీ ఎంట్రీ వీసా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పూర్తి వివరాలివే
Dubai Multiple-Entry Visa : దుబాయ్ మల్టీ ఎంట్రీ టూరిజం అనే కొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ వీసాను అందిస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Dubai Multiple-Entry Visa : భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు దుబాయ్ మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా అనే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. భారత్, యూఏఈ మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంగా ఐదేళ్ల వ్యాలిడిటీతో ఈ వీసా విధానాన్ని ప్రకటించింది. ఈ వీసాను పొందిన భారతీయ పర్యాటకులు ఐదేళ్ల పాటు దుబాయ్లో పర్యటించవచ్చు. దుబాయ్కు భారతీయ సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) ఈ కొత్త వీసా విధానాన్ని ప్రకటించింది.
ఐదేళ్ల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా ఏంటి? :
గత ఏడాదిలో భారత్ నుంచి దుబాయ్కి వచ్చే పర్యాటకుల సంఖ్య 25శాతానికి గణనీయంగా పెరిగింది. 2023లో 2.246 మిలియన్ల మంది దుబాయ్లో పర్యటించారు. అంతకుముందు ఏడాది 2022లో 1.84 మిలియన్ల మంది భారతీయ పర్యాటకులు దుబాయ్ సందర్శించారు. ప్రతి ఏడాదిలో దుబాయ్ సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 34శాతం మేర పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ సోర్స్ మార్కెట్గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారంతో పాటు పర్యాటకాన్ని మరింత ఉత్తేజపరిచేందుకు వ్యాపార సంబంధాలను పటిష్టం చేసేందుకు దుబాయ్ టూరిజం ఈ ఐదేళ్ల వీసా వ్యూహాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చింది.
మల్టీ ఎంట్రీ వీసా ఎలా పనిచేస్తుంది? :
ఈ కొత్త వీసాతో భారతీయ పర్యాటకులు తమ స్పాన్సర్షిప్పై అనేకసార్లు యూఏఈలో పర్యటించే అవకాశం ఉంటుంది. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కేవలం 5 రోజుల్లోనే జారీ అవుతుంది. అయితే, మొదట్లో 90 రోజులు దుబాయ్లో పర్యటించేందుకు అనుమతి ఉంటుంది. అవసరమైతే ఈ వీసా వ్యాలిడిటీని ఏడాదికి ఒకసారి గరిష్టంగా 180 రోజుల వరకు పొడిగించుకోవచ్చు. ఈ వీసా అనేది వివిధ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రూపొందించగా.. వ్యాపారం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు.
దుబాయ్ పర్యాటక రంగంలో భారత్ ముఖ్యమైన పాత్రను దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజంలో ప్రాక్సిమిటీ మార్కెట్స్ రీజినల్ హెడ్ బాదర్ అలీ హబీబ్ ప్రస్తావించారు. 2023లో దుబాయ్ సందర్శనలో భారతీయుల పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. భారత్ దుబాయ్కి కీలకమైన మార్కెట్గా మారిందని, డీ33 ఎజెండా లక్ష్యాలను సాధించడంలో వ్యాపారం, పెట్టుబడులు, పర్యాటకానికి కేంద్రంగా దుబాయ్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
వీసా దరఖాస్తు ప్రక్రియ :
వీసా కోసం దరఖాస్తుదారులు తప్పనిసరిగా 4వేల డాలర్ల బ్యాంక్ బ్యాలెన్స్, యూఏఈలో చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా, రౌండ్-ట్రిప్ టికెట్, యూఏసీలో బస చేసినట్లు రుజువు (హోటల్ లేదా ఇంటి అడ్రస్)తో సహా నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అప్లికేషన్లో కలర్ ఫోటో, పాస్పోర్ట్ కాపీ, మెడికల్ ఇన్సూరెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్, టూర్ ప్రోగ్రామ్, తదుపరి ప్రయాణ టిక్కెట్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.
వీసా జారీ ప్రక్రియ :
వీసా జారీ చేసే ప్రక్రియలో డిజిటల్ ఛానెల్లను (జీడీఆర్ఎఫ్ఏ వెబ్సైట్/స్మార్ట్ అప్లికేషన్) ఉపయోగించడం లేదా కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్ను సందర్శించడం వంటివి ఉంటాయి. రెండు పద్ధతులలో దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన రుసుము చెల్లించాలి. అన్ని షరతులు, పత్రాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. పాస్పోర్ట్ వ్యాలిడిటీ లేదా ట్రావెల్ డాక్యుమెంట్, రిటర్న్ టిక్కెట్, యూఏఈలో మెడికల్ ఇన్యూరెన్స్, 4వేల డాలర్ల బ్యాలెన్స్ బ్యాంక్ స్టేట్మెంట్తో సహా నిర్దిష్ట నిబంధనలు, షరతులు వీసా జారీలో వర్తిస్తాయి. భారతీయుల కోసం దుబాయ్ 5ఏళ్ల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసాను ప్రవేశపెట్టింది. రెండు దేశాల మధ్య ఆర్థికంగా బలమైన బంధాన్ని బలోపేతం చేసేందుకు భారతీయ పర్యాటకుల కోసం దుబాయ్ సౌకర్యవంతమైన వీసాను జారీ చేస్తోంది.