రెసిడెన్షియల్‌, కమర్షియల్ నిర్మాణాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు.. రియల్టీలో నయా ట్రెండ్

ప్రస్తుతం రియల్టీ రంగంలోనూ ఈ ట్రెండ్‌ మొదలైంది. జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్‌ పాయింట్‌ కూడా చేరింది.

New residential buildings with EV charging stations may get 5 costlier JLL study

EV charging stations: తెలుగు రాష్ట్రాల్లో మెల్లమెల్లగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈవీకి డిమాండ్‌ భారీగా పెరిగిందని.. 2030 నాటికి ఈవీ వాటా 40 శాతానికి చేరొచ్చని పలు సంస్థల అధ్యయనాల్లో తేలింది. దీంతో రియల్టర్లు కూడా కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. తమ ప్రాజెక్టుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక ఫెసిలిటీస్‌ కల్పిస్తున్నారు. రెసిడెన్షియల్‌, కమర్షియల్ నిర్మాణాల్లోని వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను చేర్చుతున్నారు.

పెరిగిన ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల అవసరం
గత కొన్నేళ్లుగా దేశంలో వాహన ధరలతో పాటు ఇందన ధరలు కొండెక్కాయి. దీంతో ప్రజలు కాస్త ధర ఎక్కువైనా ఎలక్ట్రికల్‌ వెహికిల్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సైతం ఈవీలకు అనేక ప్రోత్సాహకాలు ప్రకటించడం ఈ ఇండస్ట్రీకి బూస్టింగ్‌గా మారింది. దీంతో ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల అవసరం భారీగా పెరిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు కాగా.. ప్రస్తుతం రియల్టీ రంగంలోనూ ఈ ట్రెండ్‌ మొదలైంది. జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్‌ పాయింట్‌ కూడా చేరింది.

ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో సర్వీస్‌ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్‌ స్థలాన్ని ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల కోసం కేటాయిస్తారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ జేఎల్‌ఎల్‌ ఇండియా తన తాజా రిపోర్ట్‌లో తెలిపింది.

Also Read: కస్టమైజేషన్‌ ఆప్షన్‌తో తక్కువ బడ్జెట్‌లోనే ఇంటీరియర్‌ డిజైనింగ్‌

కొత్త ప్రాజెక్టుల్లో చార్జింగ్ పాయింట్లు
ఇక ఐటీ సంస్థలతో పాటు ఇతర సంస్థలు తమ పార్కింగ్ స్థలాల్లో ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించడం, అక్కడ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాజెక్ట్‌లో ప్రాపర్టీ ధర 2 శాతం నుంచి 5 శాతం వరకు అధికంగా ఉంది. చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు అనంతరం వినియోగదారుల నుంచి ఆయా సంస్థలు కొంత మొత్తంలో నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నాయి.

Also Read: గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీరు ఆదా.. ఎలాగంటే?

ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్‌ స్పేస్‌లకు కూడా ప్రస్తుతం భారీ డిమాండ్‌ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవెన్యూ షేర్‌ మోడల్‌ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగనుండటంతో న్యూ రియల్టీ ప్రాజెక్టులన్నీ ఈవీ ఇళ్లుగా రూపొందే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు.