Rbi Announces Term Liquidity Facility Of Rs 50,000 Crore For Emergency Health Security
RBI term liquidity facility for Emergency Health Security : భారతదేశాన్ని కొవిడ్-19 సంక్షోభం వెంటాడుతోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశీయంగా ఆర్థిక భారం పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా చికిత్సకు అవసరమైన వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. కొవిడ్ సంబంధిత వైద్యవిభాగాలకు నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ ప్రకటించారు.
ప్రత్యేకించి వైద్య రంగం కోసం రూ.50 వేలకోట్ల మేరకు ఆన్ట్యాప్ నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన ప్రకటించారు. దీనికి మూడేళ్ల కాల వ్యవధి ఉంటుందన్నారు. దేశంలో కోవిడ్ సంబంధిత ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచేందుకు 2022 మార్చి 31 వరకు 3 సంవత్సరాల కాలపరిమితితో రెపో రేటుకు రూ .50 వేల కోట్ల ఆన్-ట్యాప్ స్పెషల్ లిక్విడిటీ సౌకర్యాన్ని బ్యాంకులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కోవిడ్ రెండవ వేవ్ వ్యాప్తి కట్టడి చేసేందుకు వేగవంతమైన చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్ కొవిడ్ను సమర్థంగా ఎదుర్కొంటుందన్న నమ్మకం ఉందన్నారు. ఈసారి రుతుపవనాలు కూడా సానుకూలంగా ఉంటాయన్నారు. కొవిడ్ వైద్య సదుపాయాల పెంపునకు ఆర్బీఐ రూ.50వేల కోట్ల నిధులను బ్యాంకులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ నిధులను బ్యాంకులు వ్యాక్సిన్ తయారీ సంస్థలకు, ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పర్చేందుకు రుణాలుగా అందించవచ్చునని దాస్ పేర్కొన్నారు.