Mahashivratri Procession : మహాశివరాత్రి పర్వదినాన విషాదం నెలకొంది. రాజస్థాన్లోని కోటాలో మహాశివరాత్రి ఊరేగింపు వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు వేడుకల్లో పాల్గొన్న 14 మంది చిన్నారులు విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు. విద్యుత్ షాక్ గురైన చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు.
Read Also : బెంగళూరుకు తాగునీటి కష్టాలు.. మంచి నీటిని వృథా చేస్తే జరిమానా
అత్యవసర చికిత్స నిమిత్తం బాధితులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చినట్టు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన కొంతమంది పిల్లలను వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఈ విషాద ఘటనపై మంత్రి హీరాలాల్ మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. విద్యుత్ షాక్ కారణంగా చాలా మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, ఒకరికి వంద శాతం శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయని తెలిపారు. చిన్నారులకు సాధ్యమైనంత వరకు అవసరమైన అన్ని చికిత్సలను అందించడానికి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.
పిల్లలకు చికిత్స అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను మంత్రి నగర్ ఆదేశించారు. అయితే, విద్యుత్ షాక్కు హైటెన్షన్ ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ కారణమని అనుమానిస్తున్నట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. బాధితుల్లో ఇద్దరు పిల్లలు 50 శాతం, 100 శాతం కాలిన గాయాలు, మిగిలిన వారు 50 శాతం కన్నా తక్కువ కాలిన గాయాలు ఉన్నాయని పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు.