Building Collapsed
Building Collapsed : మహారాష్ట్ర థానే జిల్లాలోని భీవండిలో రెండంతస్తుల భవనం కుప్పకూలి ఐదుగురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించామని, 12 మందికి గాయాలయ్యాయని థానే మున్సిపల్ కార్పొరేన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సెల్ అధిపతి అవినాశ్ సావంత్ పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం వల్పాడలోని వర్ధమాన్ కాంపౌండ్ వద్ద భవనం కుప్పకూలింది. పైఅంతస్తులో నలుగురు కుటుంబీకులు ఉండగా గ్రౌండ్ ఫ్లోర్ లో కొందరు కూలీలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
ఘటనాస్థలిని సందర్శించిన సీఎం ఏక్ నాథ్ షిండే పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాలపై సర్వే నిర్వహించాలని కలెక్టర్ తోపాటు అధికారులను సీఎం ఆదేశించారు.