విషాదం : చెరువులో పడి నలుగురు డిప్లొమా విద్యార్థులు మృతి
కోదాడలో విషాదం నెలకొంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన విద్యార్థులు చెరువులో పడి మృతి చెందారు.

కోదాడలో విషాదం నెలకొంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన విద్యార్థులు చెరువులో పడి మృతి చెందారు.
సూర్యాపేట : కోదాడలో విషాదం నెలకొంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన విద్యార్థులు చెరువులో పడి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే… అనురాగ్ కళాశాలకు చెందిన 20 మంది డిప్లొమా విద్యార్థులు చక్రాల ప్రవీణ్ అనే విద్యార్థి పుట్టిన రోజు జరుపుకునేందుకు చెరువు కట్టపై ఉన్న వీరభద్ర దేవాలయం వద్దకు వెళ్లారు. వేడుక అనంతరం భోజనం చేసిన విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి పెద్ద చెరువు దగ్గరకు వెళ్లారు. చేతులు కడుక్కుంటుండగా సమీర్ అనే విద్యార్థి కాలు జారి చెరువులో పడిపోయాడు.
సమీర్ కేకలు వేయడంతో చక్రాల ప్రవీణ్తో పాటు భవానీ ప్రసాద్, మహేందర్ సింహ, ప్రవీణ్, ఆసిఫ్, అరవింద్, శ్రీను అతడిని కాపాడేందుకు చెరువులోకి దిగారు. సమీర్ (20), చక్రాల ప్రవీణ్ (20), భవానీ ప్రసాద్ (20), మహేందర్ సింహ (20) గల్లంతయ్యారు. మిగిలిన నలుగురు ప్రవీణ్, ఆసిఫ్, అరవింద్, శ్రీను క్షేమంగా బయటపడ్డారు. వీరు కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టణ పోలీసులు, ఆర్డీవో కిశోర్కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లను పిలిపించారు. వారితో చెరువులో గాలింపు చేపట్టి నలుగురి మృత దేహాలను వెలికి తీశారు. పోలీసులు మృత దేహాలను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు భవానీప్రసాద్, చక్రాల ప్రవీణ్లు హుజూర్నగర్కి చెందినవారు కాగా, సమీర్ నేరుడుచర్ల, మహేందర్ సింహ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాయనంపల్లి గ్రామస్థుడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.