Advocate Murder Case : న్యాయవాది హత్యకేసులో 10 మంది అరెస్ట్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మలుగు జిల్లాలో న్యాయవాది, మైనింగ్ వ్యాపారి హత్యకేసులో ఇంతవరకు 10 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు.
- chvmurthy
- Published On : August 7, 2022 / 03:06 PM IST
mulugu lawyer murder case
Advocate Murder Case : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది, మైనింగ్ వ్యాపారి హత్యకేసులో ఇంతవరకు 10 మందిని అరెస్ట్ చేసినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. ఆగస్టు 1వ తేదీన న్యాయవాది మల్లారెడ్డి హత్య జరగ్గా హత్య వెనుక ప్రధాన కుట్ర దారులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు ప్రధాన సూత్రధారులైన గోనెల రవీందర్, పిండి రవియాదవ్, వంచ రామ్మోహన్రెడ్డి, తడుక రమేష్లను పోలీసులు శనివారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు. మృతుడు మల్లా రెడ్డితో కొన్నేళ్లుగా మల్లంపల్లిలోని మైనింగు భూములకు సంబంధించి నిందితులకు పలు వివాదాలు కొనసాగుతున్నాయని ఎస్పీ వివరించారు.
మల్లారెడ్డిని అడ్డుతొలగించుకునే క్రమంలో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన ఆర్ఎంపీ,తడుకు రమేష్ కు 2020 లో 18 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఎస్పీ చెప్పారు. ఆ తర్వాత వీరు మిగిలిన వారిని కలుపుకుని ఆగస్టు 1వ తేదీన పందికుంట వద్ద దారికాచి మల్లారెడ్డిని కత్తులతో పొడిచి చంపారని పేర్కోన్నారు. ఈకేసులో మరి కొందరి ప్రమేయం ఉందని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
Also Read : Rains In Andhra Pradesh : రాగల 48 గంటల్లో ఏపీలో పలు చోట్ల వర్షాలు..ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు
