కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఎదురుదెబ్బ : ముందస్తు బెయిల్ నిరాకరణ

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 05:30 AM IST
కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఎదురుదెబ్బ : ముందస్తు బెయిల్ నిరాకరణ

Updated On : April 25, 2019 / 5:30 AM IST

కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ను నిర్బంధించిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరరించింది. కొండా వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ను నిర్బంధించిన కేసులో కొండాపై కేసు నమోదైంది. ఆయన కోసం వారం రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా కొండా విశ్వేశ్వర్ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావడం లేదు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో ఆయన పోలీసుల విచారణకు హాజరవుతారా లేక హైకోర్టుని ఆశ్రయిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఎన్నికల సమయంలో పోలీసుల తనిఖీల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువు కొండా సందీప్ రెడ్డి దగ్గర రూ.10లక్షలు దొరికాయి. దీనిపై వివరణ కోరేందుకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు తీసుకుని బంజారాహిల్స్ లోని కొండా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు తమతో దురుసుగా ప్రవర్తించారని, గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని.. ఎస్ఐ, కానిస్టేబుల్.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కొండాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున చేవేళ్ల ఎంపీగా విజయం సాధించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆయన చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.