అశ్లీల పోస్టర్లు అతికించినందుకు దర్శక, నిర్మాతలపై కేసు

  • Published By: vamsi ,Published On : February 6, 2020 / 04:23 AM IST
అశ్లీల పోస్టర్లు అతికించినందుకు దర్శక, నిర్మాతలపై కేసు

Updated On : February 6, 2020 / 4:23 AM IST

బూతు కంటెంట్‌తో వస్తున్న సినిమాల పోస్టర్లను బహిరంగంగా అతికిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. ఇష్టం వచ్చినట్లు పోస్టర్లను అతికించి పబ్లిసిటీ చేసుకోవాలని భావిస్తే మాత్రం కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసు అధికారులు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు డిగ్రీ కాలేజ్ అనే సినిమాపై చర్యలకు సిద్ధం అయ్యారు.

అమీర్‌పేట మైత్రివనమ్‌ కూడలిలో డిగ్రీ కాలేజ్‌ సినిమాకు చెందిన అశ్లీల పోస్టర్లు అతికించినందుకు సినిమా దర్శకుడు, నిర్మాతలపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెపెక్టర్‌ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం డిగ్రీ కాలేజ్‌ సినిమాకు సంబంధించిన అశ్లీలంగా ఉన్న పోస్టర్లను మైత్రివనమ్‌ పరసర ప్రాంతాల్లో అతికించారు.

వీటిని చూసి విస్తుపోయిన పలువురు పోలీసులకు సమాచారం అందించగా.. పరిశీలించిన టాస్క్‌ఫోర్సు పోలీసులు నినిమా దర్శకుడు నర్సింహ నంది, నిర్మాత శ్రీనివాస్‌రావులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు అప్పగించారు.

కేసును సుమోటోగా నమోదు చేసుకున్న ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. శ్రీలక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై వరుణ్‌, దివ్వరావు జంటగా నర్సింహ నంది దర్శకత్వంలో రూపొందిన సినిమా డిగ్రీకాలేజ్‌. ఫిబ్రవరి 7వ తేదీన సినిమా విడుదల కానుంది.