లీగలా, ఇల్లీగలా అనేది లేబర్ కోర్టు చూసుకుంటుంది : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునేలా ఆదేశించాలన్న ఆర్టీసీ జేఏసీ న్యాయవాది వాదనపై కోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునేలా ఆదేశించాలన్న ఆర్టీసీ జేఏసీ న్యాయవాది వాదనపై కోర్టు కీలక వ్యాఖ్యలు
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునేలా ఆదేశించాలన్న ఆర్టీసీ జేఏసీ న్యాయవాది వాదనపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమకు కొన్ని పరిమితులు ఉన్నాయని, వాటిని దాటి వెళ్లలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. రెండు వారాల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికశాఖ కమిషనర్ను ఆదేశిస్తామన్న న్యాయస్థానం.. ఈ విషయాన్ని లేబర్ కోర్టు చూసుకుంటుందని చెప్పింది.
అంతకు ముందు ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశించలేమని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సమ్మె లీగల్, ఇల్లీగల్ అని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉందని చెప్పింది. ప్రభుత్వంతో చర్చలకు కమిటీని వేయాలని ఆర్టీసీ జేఏసీ న్యాయవాది మరోసారి హైకోర్టును కోరగా.. కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని కోర్టు తెలిపింది. ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా కమిటీ వేయాలన్న ఆర్టీసీ జేఏసీ న్యాయవాది హైకోర్టును కోరారు.
మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. పారిశ్రామిక వివాదాల చట్టం, ప్రొహిబిషన్ ఆఫ్ స్ట్రైక్ యాక్ట్ ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని కోర్టుకు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా సమ్మెకు వెళ్లారన్న ప్రభుత్వ న్యాయవాది.. సెక్షన్ 24 ప్రకారం కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధంగా ప్రకటించాని హైకోర్టును కోరారు.
ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై ప్రభుత్వం వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేసింది. దీనిపై సోమవారం(నవంబర్ 18,2019) హైకోర్టులో వాదనలు జరిగాయి. కార్మికులతో చర్చలు జరపలేము అని ఒక అఫిడవిట్, రూట్ల ప్రైవేటీకరణపై అదనపు అఫిడవిట్ ప్రభుత్వం దాఖలు చేసింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వాదనలను అడిషనల్ ఏజీ రాంచందర్ రావు వినిపించారు. సమ్మె చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. సమ్మె ముందు కార్మికులు నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టుకి చెప్పారు.
నోటీసు ఇచ్చిన తర్వాత కనీసం 6 వారాల పాటు ఆర్టీసీ నిర్ణయం కోసం కార్మిక సంఘాలు చూడాలన్నారు. కార్మికులు చట్ట ప్రకారం నడుచుకోలేదని కోర్టుకి చెప్పారు. యూనియన్ల నేతలు తమ స్వార్థంతో ఆర్టీసీని నస్టాల్లోకి నెడుతున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపారని, పరిస్థితి చేయి దాటిపోతుందని.. సమ్మెను ఇల్లీగల్ అని ప్రకటించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుని కోరారు.