“బాబ్బాబు.. ప్లీజ్”.. నిన్న బెదిరించి.. ఇవాళ భారత్‌ను అడుక్కుంటున్న పాక్..

“బాబ్బాబు.. ప్లీజ్”.. నిన్న బెదిరించి.. ఇవాళ భారత్‌ను అడుక్కుంటున్న పాక్..

Updated On : August 12, 2025 / 9:59 PM IST

అమెరికా పర్యటన వేళ పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్‌ భారత్‌పై పిచ్చి ప్రేలాపనలు చేసిన విషయం తెలిసిందే. తమ అణ్వాయుధ సామర్థ్యం ఉన్న దేశమని, భవిష్యత్తులో భారత్‌ నుంచి పాకిస్థాన్ అస్థిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరించే ప్రయత్నాలు చేశారు. మరోవైపు, మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో కూడా సింధూ జలాలపై నోరు పారేసుకుంటున్నారు.

ఇప్పుడేమో పాకిస్థాన్ మళ్లీ భారత్‌ను బతిమిలాడుకుంటోంది. సింధూ జలాల ఒప్పందం అమలును తిరిగి ప్రారంభించాలని భారత్‌ను కోరుతోంది. జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత మే నెలలో భారత్‌ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.

తాజాగా, పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ కార్యాలయం స్పందిస్తూ.. “సింధూ జలాల ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడంలో పాకిస్థాన్‌ కట్టుబడి ఉంది. భారత్‌ వెంటనే సాధారణ అమలును పునఃప్రారంభించాలి” అని కోరింది.

Also Read: గువ్వల బాలరాజు చేరికపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు.. ఏం జరుగుతోంది?

కాగా, బిలావల్ భుట్టో జర్దారి సింధూ నది నీటిని పాకిస్థాన్‌కు దూరం చేయడాన్ని దేశం, ముఖ్యంగా సింధ్‌ చరిత్ర, సంస్కృతి, నాగరికతపై దాడిగా అభివర్ణిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

“భారత ప్రధాని నరేంద్ర మోదీ సింధూపై దాడిని ప్రకటిస్తే, ఆయన మా చరిత్ర, మా సంస్కృతి, మా నాగరికతపై దాడి చేస్తున్నట్టే” అని అన్నారు.

“మనం గతంలో యుద్ధాలు చేశాం, కానీ ఇండస్‌పై ఎప్పుడూ దాడి జరగలేదు, నదిపై ఆనకట్టలు లేదా కాలువలు నిర్మించాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు” అని ఆయన అన్నారు. “యుద్ధం జరిగితే మోదీని ఎదుర్కొనే శక్తి పాకిస్థాన్ ప్రజలకు ఉంది” అని ఆయన హెచ్చరించారు.