ఆస్ట్రేలియాలో తొలి కరోనా మృతి

చైనాతో పాటు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్(కోవిడ్ 19) కారణంగా ఆస్ట్రేలియాలో తొలి మరణం సంభవించింది. ఇప్పటివరకు చైనా, ఇరాన్ దేశాల్లో ఎక్కువగా మరణాలు సంభవించగా.. తొలి మరణం ఆస్ట్రేలియాలో నమోదు కావడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 78ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలోని సర్ చార్లెస్ గైర్డ్నర్ హాస్పిటల్లో ఈ మరణం నమోదైంది.
మృతి చెందిన వ్యక్తిని ఇటీవలే జపాన్ నౌక డైమండ్ ప్రిన్సెస్ నుంచి తీసుకొచ్చి పెర్త్లోని ఈ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. మొత్తం 121 మందిని ఆస్ట్రేలియా ప్రభుత్వం నౌక నుంచి తీసుకుని వచ్చింది. వారందరినీ ప్రత్యేక శిబిరంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలోనే అందులో ఒక వ్యక్తి చనిపోయాడు.
ఇక చైనాలో కరోనా వైరస్ బారిన పడి 35 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 2,870కి చేరుకుంది. ఇక కొత్తగా మరో 573 మందికి వైరస్ సోకినట్లు గుర్తించగా.. బాధితుల సంఖ్య 79,824ను చేరుకుంది.