ప్రపంచం పెను ముప్పును ఎదుర్కొంటోంది..కరోనా వైరస్ రూపంలో అన్ని దేశాలను వణికిస్తోంది. చైనా తర్వాత ఆ స్థాయిలో కరోనాకి బాధిత దేశంగా ఇటలీలో మరణ మృదంగం మోగుతోంది. అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోన్న ఇటలీ దేశం ఇప్పుడు ఓ నిశ్శబ్దప్రాంతంగా మారిపోయింది. ఫుడ్ స్టోర్స్, ఫార్మసీలు..ఈ రెండూ తప్ప ఇటలీలో ఇప్పుడు ఏ దుకాణం తెరిచి కన్పించడం లేదు.
ఎటు చూసినా రెస్టారెంట్లు, షాపులు, బార్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులన్నీ..మూసేసి కన్పిస్తున్నాయి. దేశం మొత్తం శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. కరోనా వైరస్ ఉధృతి ఇలానే కొనసాగితే ఇటలీలో మానసిక వ్యాధులు ప్రబలే అవకాశం కూడా కన్పిస్తోందంటున్నారు నిపుణులు. కరోనా కోరల్లో విలవిలలాడుతోన్న ఇటలీ వాసులు ఇక్కడి జైళ్ల ముందు ధర్నాలకు దిగారు. జైళ్లలోని తమ బంధువులకు వైరస్ సోకుతుందని..వారిని వారిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.
అసలే వైరస్ విస్తరిస్తున్న తీరుతో బెంబేలెత్తుతున్న జనం ఓ నలుగురు గుమిగూడాలన్నా వణికిపోతున్నారికక్కడ. వందమందికి మించిన ఎలాంటి ఫంక్షన్లూ కూడా నిర్వహించ వద్దని అధికారులు ప్రజలకు ఆదేశాలు జారీ చేసారు. దేశం మొత్తం క్వారంటైన్లోకి వెళ్లిపోయింది. ఫుట్ బాల్ లవర్స్కి కేరాఫ్ అడ్రస్ అయిన ఇటలీలో మొత్తం ఆటలన్నీ నిలిపివేశారు. 12 వేలకి పైబడిన వైరస్ బాధితులలో 900 మంది ఐసియూలో చికిత్స పొందుతుండటం వైరస్ ఉధృతికి నిదర్శనం..
అంతేకాదు ఇక్కడి పరిస్థితే మిగిలిన దేశాలకూ దాపురిస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎమర్జెన్సీ హెడ్ మైఖేల్ రేయాన్ హెచ్చరిస్తుండటం అన్ని దేశాలను భయాందోళనలోకి నెట్టేస్తోంది. ఆయన చెప్పిందే కనుక నిజమైతే..ఆ ఊహే వళ్లు జలదరింపజేస్తోంది. అఁదుకే ప్రపంచ ఆరోగ్యసంస్థే అన్ని దేశాలను కరోనాని ఎదుర్కొనే పద్దతులను పంచుకోవాల్సిందింగా విజ్ఞప్తి చేసింది.
Read More : ఇండియాలో కరోనా పెరుగుతున్న మృతుల సంఖ్య : మహారాష్ట్రలో మరొకరి మృతి ?