రంగంలోకి నేపాల్ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు, రాముడి జన్మస్థలంపై అధ్యయనం
రాముడు భారతీయుడు కాదు, నేపాలీ.. రాముడు నేపాల్ లో జన్మించాడు, నిజమైన అయోధ్య నేపాల్ లో ఉంది అంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనా ఉచ్చులో పడిన నేపాల్ ప్రధాని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
సాక్ష్యాలు సేకరించే పనిలో శాస్త్రవేత్తలు:
ఖాట్మాండులోని బిర్గంజ్ టౌన్ లో థోరి.. రాముడి జన్మ స్థలం అని నేపాల్ ప్రధాని ఇటీవల చెప్పారు. దీనిపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, నేపాల్ ప్రధాని మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. రాముడి జన్మ స్థలం నేపాల్ అని నిరూపించే పనిలో పడ్డారు. అందుకు ఆధారాలు సేకరించే పనికి శ్రీకారం చుట్టారు. నేపాల్ కు చెందిన పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. రాముడి జన్మ స్థలంగా చెబుతున్న బిర్గంజ్ టౌన్ లోని థోరి దగ్గర పురావస్తు ప్రదేశాన్ని అన్వేషించే పనిలో పడ్డారు. థోరి, ప్రముఖ పురాతన హిందూ మత ప్రదేశాల సమూహం. నిత్యం నేపాల్ లోని వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు థోరికి వస్తుంటారు. థోరీలో పురావస్తు అధ్యయనాలు ప్రారంభించేందుకు పలు శాఖలతో పురావస్తు శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్టు ఆర్కియాలజీ శాఖ అధికార ప్రతినిధి రామ్ బహుదూర్ తెలిపారు.
రాముడు భారతీయుడు కాదు నేపాలీ:
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు భారతీయుడు కాదు, నేపాలీ.. ఆయన పుట్టింది భారత్లో కానేకాదు.. నేపాల్లోనే అంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వింతవాదన తెరపైకి తెచ్చారు. కొన్ని రోజుల క్రితం ఆయనీ వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాలైన లిపూలేఖ్, కాలాపానీ ప్రాంతాలను నేపాల్ మ్యాప్లో పొందుపరుస్తూ రాజ్యాంగ సవరణ చేసి రెండు దేశాల మధ్య అగ్గిరాజేసిన ఓలీ, ఇప్పుడు రాముడు మా వాడు అంటూ మరో వివాదానికి తెరలేపారు. భారత్, ఇన్నాళ్లుగా నేపాల్ను సాంస్కృతిక దోపిడీ చేస్తూ వచ్చిందని ఆరోపించారాయన. ఇంత కాలం పాటు సీతమ్మను భారతీయుడైన రాముడికి ఇచ్చామని అనుకుంటూ వచ్చామని, కానీ చరిత్రలోని వాస్తవాలు బయటకు రావాల్సి ఉందని, రాముడు కూడా నేపాలీనేని అన్నారు. శ్రీరామ జన్మభూమిగా చెప్పే నిజమైన అయోధ్య నేపాల్లోని బిర్గంజ్ ప్రాంతంలో ఉందని చెప్పారు. భారత్లోని అయోధ్య కృత్రిమంగా క్రియేట్ చేసిందని ఆరోపించారు ఓలీ. రామాయణాన్ని సంస్కృతం నుంచి నేపాలీ భాషలోకి అనువదించిన నేపాల్ కవి భానుభక్తాచార్య 206వ జయంతి సందర్భంగా జూలై 13న జరిగిన కార్యక్రమంలో నేపాల్ ప్రధాని ఓలీ ఈ వ్యాఖ్యలు చేశారు.
నేపాల్ ప్రధాని వ్యాఖ్యల వెనుకు చైనా?
ఓలీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. భారతీయులు నేపాల్ ప్రధానిపై భగ్గుమన్నారు. చైనాతో చేతులు కలిపిన నేపాల్ ప్రధాని భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని, నోటికొచ్చినట్టు కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఓలీ వ్యాఖ్యలుకు భారత్ లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత సాంస్కృతిక వారసత్వం ఏంటన్నది ప్రపంచానికి తెలుసని.. ఓలీ మాటలను ప్రపంచం అంగీకరించదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ అన్నారు. ఓలీ వ్యాఖ్యలను ఆ దేశ విదేశాంగశాఖ ఓ క్లారిటీ ఇచ్చిందని.. దీనిపై అంతకంటే ఎక్కువ మాట్లాడలేనని ఆయన చెప్పారు. పురాణాల ప్రకారం సరయు నది ఒడ్డున ఉన్న అయోధ్యలో రాముడు పుట్టడాని శివసేన స్పందించింది. సరయు పేరుతో అసలు నేపాల్ లో నది లేదని తెలిపింది.