25% టారిఫ్ గడువు ముంచుకొస్తున్న వేళ ట్రంప్కు నిక్కీ హేలీ హెచ్చరిక.. 5 పాయింట్లు.. ఈ టారిఫ్లు అమలు చేస్తేగనుక..
ఇది ప్రతికూల అంశమని పేర్కొన్నారు. భారత్ను భాగస్వామిగా కాక శత్రువుగా చూడడం “భారీ తప్పు” అవుతుందని హెచ్చరించారు.

Nikki Haley Donald Trump
Nikki Haley: భారత్పై మరో 25 శాతం టారిఫ్ అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ మొదటిసారి విధించిన 25 శాతం టారిఫ్ 2025 ఆగస్టు 1 నుంచి మొదటి అమలవుతోంది.
ట్రంప్ రెండోసారి విధించిన మరో 25 శాతం (టారిఫ్ మొత్తం 50 శాతం అయ్యే విధంగా) సుంకాలు 2025 ఆగస్టు 27 నుంచి అమలు అవుతాయి. ఈ సుంకం గడువు ముంచుకొస్తున్న వేళ ట్రంప్ను రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ హెచ్చరించారు. (Nikki Haley)
డొనాల్డ్ ట్రంప్ పాలనలో భారత్తో సంబంధాలు ఆందోళనకరంగా ఉన్నాయని హేలీ అన్నారు.
చైనాను ఎదుర్కోవడంలో కీలకమైన భాగస్వామిగా భారత్ ఉందని, వాణిజ్య ఉద్రిక్తతలతో ఈ సత్సంబంధాలు దెబ్బతీయవద్దని సూచించారు.
న్యూస్వీక్ పత్రికలో నిక్కీ హేలీ కీలక అంశాలు
హడ్సన్ ఇనిస్టిట్యూట్కు చెందిన బిల్ డ్రెక్సెల్తో కలిసి న్యూస్వీక్ పత్రికలో రాసిన వ్యాసంలో నిక్కీ హేలీ కీలక అంశాలు పేర్కొన్నారు. ఆసియాకు సంబంధించిన అమెరికా వ్యూహానికి భారత్తో సంబంధాలు బలపరచడం అత్యంత ముఖ్యమని చెప్పారు.
“ఆసియాలో చైనాను నిలువరించే సామర్థ్యం ఉన్న ఏకైక దేశం భారత్. అలాంటి దేశంతో 25 ఏళ్లుగా అమెరికా మెరుగుపర్చుకున్న సత్సంబంధాలను అడ్డుకోవడం ‘స్ట్రాటెజిక్ డిజాస్టర్’ అవుతుంది” అని హేలీ హెచ్చరించారు.
అదనంగా టారిఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుతో భారత్ నుంచి దిగుమతులపై అదనంగా 25% సుంకం విధించారు.
రష్యా నుంచి నేరుగా లేదా పరోక్షంగా భారత్ చమురు దిగుమతి చేస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
జూలై 31న భారత్ దిగుమతులపై ఆమోదించిన 25% సుంకానికి ఈ టారిఫ్ను అదనంగా విధించారు.
నిక్కీ హేలీ రాసిన 5 ప్రధాన అంశాలు
టారిఫ్ ఉద్రిక్తతలు
భారతీయ ఉత్పత్తులపై 25% టారిఫ్లు విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనను నిక్కీ హేలీ వ్యతిరేకించారు. ఇది ప్రతికూల అంశమని పేర్కొన్నారు. భారత్ను భాగస్వామిగా కాక శత్రువుగా చూడడం “భారీ తప్పు” అవుతుందని హెచ్చరించారు.
భారత్ వర్సెస్ చైనా
భారత్ను చైనాతో పోల్చకూడదని హేలీ అన్నారు. “భారత్ విలువైన స్వేచ్ఛా ప్రజాస్వామ్య భాగస్వామి. చైనా వంటి శత్రువు కాదు” అని పేర్కొన్నారు. రష్యా చమురు ప్రధాన కొనుగోలుదారుగా ఉన్నప్పటికీ చైనాపై మాత్రం ఇలాంటి ఆంక్షలు లేవని గుర్తుచేశారు.
వ్యూహాత్మక ప్రాముఖ్యత
సప్లై చైన్స్ విషయంలో భారత్ సామర్థ్యం, అవకాశాన్ని హేలీ గుర్తుచేశారు. “భారత్కు మాత్రమే చైనా తరహాలో భారీగా ఉత్పత్తులు అందించే సామర్థ్యం ఉంది.
టెక్స్టైల్స్, తక్కువ ధరకు మొబైల్స్, సోలార్ ప్యానెల్స్ వంటి వస్తువులను అమెరికాలో వేగంగా/సమర్థంగా తయారు చేయడం సాధ్యం కాదు.
రక్షణ, భద్రత
గ్లోబల్ సెక్యూరిటీలో భారత్కు పెరుగుతున్న పాత్రను నిక్కీ హేలీ గుర్తుచేశారు. అమెరికా, మిత్రదేశాలతో రక్షణ సహకారం పెంచుకోవడం వల్ల భారత్ “స్వేచ్ఛా ప్రపంచ భద్రతకు కీలక సంపద”గా మారుతోందని తెలిపారు.
భారత్కు సలహా
రష్యా చమురు అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయాన్ని భారత్ గౌరవించాలని నిక్కీ హేలీ సూచించారు.
వైట్హౌస్తో కలిసి పరిష్కారం కనుగొనాలని కోరారు. డొనాల్డ్ ట్రంప్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరపాలని కోరారు. “చర్చలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిది” అని చెప్పారు.