భారత్లో పత్రికా స్వేచ్ఛ రోజురోజుకు దిగజారిపోతుందిని ‘‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’’ అనే స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2019 ఏడాదికి పత్రికా స్వేచ్ఛ అంశంలో 180 దేశాలకు ర్యాంకులు కేటాయించగా భారత్కు 140వ ర్యాంకును ఇచ్చింది. భారత్లో పాత్రికేయులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, పాత్రికేయులపై పోలీసులు, మావోయిస్టులు, నేర ముఠాలు, అవినీతి రాజకీయ నాయకులు హింసాత్మక దాడులు చేస్తున్నారని, జర్నలిస్ట్లను బెదరిస్తున్నారని సంస్థ నివేదికలో తెలిపింది. ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ 2019’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పలు విషయాలను కూడా సంస్థ బహిర్గతం చేసింది.
భారత్లో 2018వ సంవత్సరంలో ఆరుగురు జర్నలిస్టులను వారు జర్నలిజం వృత్తిలో భాగంగా చేసిన కృషి కారణంగా దారుణంగా హత్య చేశారని సంస్థ చెప్పింది. మరో జర్నలిస్టు మృతి అంశంలో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. నేషనల్ మీడియాతో పాటు.. ప్రాంతీయ మీడియా వ్యక్తులపైన దాడులు జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
భారత్కు కేటాయించిన ర్యాంకును బట్టి చూస్తే పత్రిక స్వేచ్ఛ అనేది భారత్లో లేదు అనుకోవాల్సి వస్తుంది అని సంస్థ తన రిపోర్ట్లో రాసింది. సార్వత్రిక ఎన్నికల వేళ జర్నలిస్ట్లకు ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని చెప్పింది సంస్థ. కశ్మీరు వంటి ప్రాంతాల్లో విదేశీ పాత్రికేయులను అసలు అడుగు పెట్టనీయట్లేదని, అక్కడ పనిచేయడం జర్నలిస్ట్లకు కష్టంగా మారిందని నివేదిక చెప్పింది. 2018లో ఇదే రిపోర్ట్లో భారత్కు 138వ ర్యాంకు దక్కింది.
ఇక నార్వే మూడోసారి తొలి ర్యాంకును నిలబెట్టుకోగా.. ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్కు పొరుగు దేశాలైన పాకిస్తాన్ 142వ ర్యాంకులో చేరగా, బంగ్లాదేశ్కు 150వ ర్యాంకు వచ్చింది. చివరి నాలుగు ర్యాంకులు విషయానికి వస్తే.. తుర్క్మెనిస్తాన్కు 180వ ర్యాంకు, ఉత్తర కొరియాకు 179వ ర్యాంకు, చైనాకు 177వ ర్యాంకు, వియత్నాంకు 176వ ర్యాంకులో ఉన్నాయి.