Gaza Hospital : గాజా ఆసుపత్రిలో విద్యుత్ కట్…నవజాత శిశువులను ఇంక్యుబేటర్ల నుంచి బయటకు తీసి…
ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న భీకర యుద్ధం నవజాత శిశువులను తీవ్ర ప్రమాదంలో పడేసింది. ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ దాడులతో గాజా నగరంలోని అతి పెద్ద అల్ షిఫా ఆసుపత్రిలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది.....
Gaza Hospital : ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న భీకర యుద్ధం నవజాత శిశువులను తీవ్ర ప్రమాదంలో పడేసింది. ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ దాడులతో గాజా నగరంలోని అతి పెద్ద అల్ షిఫా ఆసుపత్రిలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో నెలలు నిండకుండానే తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువులను ఇంక్యుబేటర్ల నుంచి బయటకు తీసి సాధారణ బెడ్స్ పై ఉంచాల్సి వచ్చింది. గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిలో ఇంక్యుబేటర్లను తీసిన తర్వాత నవజాత శిశువులను మంచం మీద ఉంచిన దృశ్యాలు అందరినీ కంట తడి పెట్టిస్తున్నాయి.
ALSO READ : Andhra Pradesh Rains : రెయిన్ అలర్ట్.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
నవజాత శిశువులను ఒకే మంచంపై పక్కపక్కనే పడుకోబెట్టారు. వెచ్చదనం కోసం శిశువుల చుట్టూ పచ్చని బట్టతో చుట్టారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నవజాత శిశువులను ఇంక్యుబేటర్ల నుంచి బయటకు తీయడంతో వారి జీవితాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. ఇజ్రాయెల్ సైనికులు అల్ షిఫా ఆసుపత్రిని చుట్టుముట్టడంతో గాజా ఆసుపత్రిలో విద్యుత్, మంచినీరు, ఆహారం, మందుల కొరత ఏర్పడింది. దీంతో ఆసుపత్రిలో 39 మంది ఉన్న నవజాత శిశువుల సంఖ్య 36 కు తగ్గిందని అల్ షిఫాలోని పీడియాట్రిక్ విభాగం అధిపతి డాక్టర్ మొహమ్మద్ తబాషా చెప్పారు.
ALSO READ : Assembly Elections 2023: ఓబీసీ కోటాపై మాటల యుద్ధం.. రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
నెలలు నిండకుండానే 1.5 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువులను ఉష్ణోగ్రత, తేమను నియంత్రించేలా ఇంక్యుబేటర్లలో ఉంచాలి. ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో వారిని ఇంక్యుబేటర్ల నుంచి సాధారణ మంచాలకు తరలించాల్సి వచ్చిందని డాక్టర్ తబాషా చెప్పారు. నవజాత శిశువులు పాలకొరత, వ్యాధులతో అల్లాడుతున్నారని డాక్టర్ పేర్కొన్నారు. శిశువులు తీవ్ర చలిలో ఉన్నారని, విద్యుత్ కోతల కారణంగా ఉష్ణోగ్రత స్థిరంగా లేదని డాక్టర్ చెప్పారు.
ALSO READ : Nampally Fire Incident : నాంపల్లి అగ్నిప్రమాదం ఎలా జరిగింది..?
ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు లేనప్పుడు, పసికందులకు రోగనిరోధక శక్తి లేనందున వివిధ రకాల వైరస్ లు వస్తాయని వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కట్ వల్ల పాలను హీట్ చేసి క్రిమిరహితం చేసే మార్గం కూడా లేకపోవడంతో శిశువులు అతిసారం, డీ హైడ్రేషన్, గ్యాస్ట్రిటిస్ వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు చెప్పారు. శిశువుల పరిస్థితి ప్రాణాంతకంగా మారిందని మరో డాక్టర్ అహ్మద్ ఎల్ మొఖల్లాలతీ చెప్పారు.వైద్యులు, నలుగురు నర్సుల పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు. యుద్ధం వల్ల తాము మానసికంగా, శారీరకంగా అలసి పోయామని వైద్యులు ఆవేదనగా చెప్పారు.