చిన్నారులపై అత్యాచారం చేస్తే బహిరంగ ఉరి

పాకిస్తాన్ పార్లమెంట్ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)సంచనల నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లలను లైంగికంగా వేధించడం,హత్య చేసినట్లు నిర్థారణ జరిగితే దోషులను బహిరంగంగా ఉరితీసే తీర్మాణాన్ని పాక్ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అలీ ముహమ్మద్ ఖాన్ ప్రవేశపెట్టారు. బిలావాల్ భుట్టో జర్దారీ యొక్క పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) ను మినహాయించి మెజారిటీ ఓట్లతో తీర్మాణం ఆమోదించారు.

2018లో నౌషెరా ప్రాంతంలో 8ఏళ్ల బాలికపై లైంగికదాడి చేసి ఆ తర్వాత హత్య చేసిన ఘటన పాకిస్తాన్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2018లో పాక్ లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి 3,800 కేసులు నమోదైనట్లు పాక్ కు చెందిన పిల్లల హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. దీంతో చిన్నారులపై లైంగిక దాడులు,హత్యలకు పాల్పడేవాళ్లకు బహిరంగ ఉరిశిక్ష విధించాంటూ ఆ దేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ తీర్మాణాన్ని ఆమోదించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉరి తీయడం సరైదని కాదని,ఐక్యరాజ్యసమితి నిబంధనలు ఉల్లఘించడమే అవుతుందని,దోషులకు విధించే శిక్షల్లో తీవ్రత పెంచినంత మాత్రాన నేరాల సంఖ్య తగ్గదు అని పాకిస్తాస్ పీపుల్స్ పార్టీ నాయకుడు రాజా అష్రాఫ్ అన్నారు. మానవహక్కుల శాఖ మంత్రి శిరీన్ బజారీ కూడా ఈ తీర్మాణాన్ని వ్యతిరేకించారు.

ఈ తీర్మాణం పార్టీ తీసుకున్న నిర్ణయమే తప్ప ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలా కనిపించడం లేదని మంత్రి అన్నారు. చాలా మంది దీనిని వ్యతిరేకిస్తున్నారన్నారు. దీనిని ఎట్టిపరిస్థితుల్లో మానవహక్కుల మంత్రిత్వశాఖ అంగీకరించదని  తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి కూడా ఈ తీర్మానాన్ని తీవ్రంగా ఖండించారు.