దొంగలందు మంచి దొంగలు వేరయా..! నిజమే.. డబ్బు కోసం దొంగలు మర్డర్లు చేయడం చూస్తుంటాం.. డబ్బు తీసుకున్న వెంటనే పారిపోవడం గమనిస్తుంటాం. అయితే చైనాలోని హేయువాన్ అనే నగరంలో మాత్రం ఓ దొంగ దొంగతనానికి వచ్చి చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. లీ అనే యువతి డబ్బు తీసుకునేందుకు ఏటిఎమ్కు వెళ్లగా.. ఓ దొంగ ఏటిఎమ్లోకి చొరబడి కత్తితో బెదిరించి విత్డ్రా చేసిన డబ్బు మొత్తం తీసుకున్నాడు.
అనంతరం అకౌంట్లో ఎంత ఉందో చెక్ చేయమన్నాడు. చెక్ చేసిన అనంతరం లీ అకౌంట్లో డబ్బు లేదు. దాంతో లీ పరిస్థితిని అర్ధం చేసుకున్న దొంగ ఆమె నుంచి తీసుకున్న సొమ్మంతా తిరిగిచ్చేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం ఈ సంఘటన ఫిబ్రవరిలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోండగా.. అతనిని మంచిదొంగ అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే డబ్బు తీసుకోకపోయినప్పటికీ అతను చేసింది తప్పే కావడంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కూడా దొంగ మంచితనాన్ని మెచ్చుకున్నప్పటికీ శిక్ష మాత్రం పడుతుందని చెబుతున్నారు. అయితే మంచి దొంగను శిక్షించడం ఎందుకు? అని నెటిజన్లు దొంగకు మద్దతుగా కామెంట్లు పెట్టడం విశేషం.