Afghan Taliban : అఫ్ఘాన్ తాలిబన్ల ఆధిపత్యంతో భారత్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు చైనా కూడా తాలిబన్లతో చేయి కలపడంతో ఆందోళన ఇంకాస్త పెరిగింది. అఫ్ఘాన్లో మన పెట్టుబడులకు రక్షణ కరువైంది. తాలిబన్లను అడ్డం పెట్టుకుని మనల్ని ఇబ్బంది పెట్టేందుకు చైనా, పాక్ ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.
భారత్కి పొరుగు దేశమైన అఫ్ఘాన్ వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఆసియాలోని వాణిజ్య రవాణాకు ఈ దేశమే ప్రధాన కేంద్రం. నిత్యం హింసతో రగిలిపోయే అఫ్ఘాన్లో శాంతి స్థాపన కోసం భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. అభివృద్ధి మంత్రంతో తాలిబన్లకు చెక్ పెట్టాలని ట్రై చేసింది. ఆ దేశానికి అండగా ఉంటూ భారీ పెట్టుబడులు పెట్టింది.
గత కొద్ది ఏళ్లలో చూసుకుంటే పలు ప్రాజెక్ట్ల కోసం అఫ్ఘాన్లో 2,200 కోట్ల పెట్టుబడులు పెట్టింది భారత్. మరో 600 కోట్ల పెట్టుబడులు పెడతామని గతేడాది మోడీ సర్కార్ ప్రకటించింది. ఇప్పుడు అక్కడ పరిణామాలన్నీ మారిపోవడంతో మన పెట్టుబడులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. పెట్టుబడుల సంగతి పక్కన పెడితే తాలిబన్లతో మరో టెన్షన్ మొదలైంది.
పాక్ ఎన్ని నీతి సూత్రాలు చెప్పినా తాలిబన్లు మానవతావాదులు అయిపోరు. ఈ విషయం అందరికి తెలుసు. అలాంటి వారిని పావుగా వాడుకుని శత్రుదేశాలపై ప్రయోగించాలన్నది చైనా, పాకిస్తాన్ ప్లాన్. ఇప్పటికే అఫ్ఘాన్లోని సరిహద్దు ప్రాంతాలన్నీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మరికొద్ది నెలల్లో ఆ భూభాగం 20 ఏళ్ల తర్వాత తాలిబన్ల జెండా ఎగురుతుంది.
తుపాకీ నీడలో పాలన నడుస్తుంది. ఆ తర్వాత వారి సాయంతోనే మనల్ని ఇరుకున పెట్టాలన్నది చైనా వ్యూహంగా కన్పిస్తోంది. ఇప్పటికే దాయాది పాక్ ఉగ్రవాదులను ఉసిగొల్పి సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఇప్పుడు తాలిబన్లు కూడా దానికి తోడైతే ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అఫ్ఘాన్ పూర్తిగా తాలిబన్లు చేతుల్లోకి వెళ్తే భారత్ కొత్త సమస్యలను ఎదుర్కోక తప్పదు. నిజానికి ఈ పరిణామాలు భారత్కు మాత్రమే కాదు. ఇతర దేశాలకు కూడా ఓ అలెర్ట్ లాంటిదేనని భావించాలి.అఫ్ఘాన్ను తాలిబన్లు పూర్తి స్థాయిలో ఆక్రమించుకుని… చైనా, పాక్తో కలిసి చెలరేగిపోతే ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం ముప్పు మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.