టిక్ టాక్ కంపెనీ సీఈవో కెవిన్ మాయర్ తన పదవికి రాజీనామా చేశారు. టిక్ టాక్పై ప్రపంచమంతా వ్యతిరేకత వ్యక్తమవుతుండడం.. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ చేయడంతో కెవిన్ మాయర్ తన రాజీనామా ప్రకటించారు. కెవిన్ రాజీనామాను గౌరవిస్తున్నట్లు టిక్ టాక్ తెలిపింది.
ఇటీవల రాజకీయ వాతావరణం వేగంగా మారిపోయింది. కార్పొరేట్ వ్యవస్థలో ప్రపంచస్థాయిలో వ్యాపారానికి అవసరమైన మార్పులను చేశాను. నేను వైదొలగుతున్నాను. ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతకు త్వరలోనే ఓ పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా. నేను మీ అందరినీ విడిచి వెళ్లిపోవడం బాధగా ఉంది అని కెవిన్ మాయర్ తెలిపారు.
కాగా, కెవిన్ మాయర్ గతంలో డిస్నీ సంస్థలో పనిచేశారు. 4 నాలుగు నెలల క్రితమే టిక్ టాక్ ఆయన్ను సీఈవోగా నియమించింది. మాయర్ రాకతో అమెరికాలో టిక్ టాక్ దూసుకెళ్తుందని భావించింది. మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ, శాన్డియాగో స్టేట్ యూనివర్శిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టాలను అందుకున్న కెవిన్.. అమెరికా రెగ్యులేటరీలకు అనుగుణంగా యాప్లో మార్పులు చేసి ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళతారని అంచనావేసింది.
కానీ పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. భారత్లో టిక్టాక్ను నిషేధించడం.. ఆ తర్వాత అమెరికాలోనూ బ్యాన్ విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో ఇబ్బందులో పడింది.
కెవిన్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన సీఈఓ స్థానాన్ని వెనెస్సా పప్పాస్తో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన టిక్టాక్ జనరల్ మేనేజర్గా పని చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పప్పాస్.. టిక్టాక్ సీఈఓగా బాధ్యతలను స్వీకరిస్తారని తెలుస్తోంది.