Rajadhani Files : ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనకు.. తొలగిన అడ్డంకులు..
'రాజధాని ఫైల్స్' సినిమా ప్రదర్శనకు అడ్డంకులు అన్ని తొలిగిపోయాయి.
Rajadhani Files : ఏపీలో రాబోయే ఎన్నికల హీట్ అంతా టాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తుంది. ఎలక్షన్స్ కి సినిమాని ఆయుధంగా చేసుకొని పలు పొలిటికల్ డ్రామా సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంతోనే యాత్ర 2, వ్యూహం, శపథం సినిమాలు రూపొందాయి. ఇక ఇదే తరహాలో తెరకెక్కిన మరో చిత్రం ‘రాజధాని ఫైల్స్’.
ఏపీ రాజధాని అమరావతి రైతుల పోరాటం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ తోనే ఆడియన్స్ కి ఒక రేంజ్ సినిమా చూపించేసిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 15న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మధ్యలోనే నిలిపివేతకు గురయ్యింది. మూవీ పై వైస్సార్సీపీ నాయకులు అభ్యంతరం తెలుపుతూ కోర్టుకి వెళ్లడంతో.. న్యాయస్థానం సినిమా ప్రదర్శన పై స్టే విధించింది. దీంతో నిన్న షో ప్రదర్శిస్తున్న మధ్యలోనే మూవీని ఆపేసి.. ఆడియన్స్ ని బయటకి పంపించేశారు.
Also read : Kalki 2898 AD : కల్కి సెట్స్ నుంచి వీడియో లీక్.. నెట్టింట ఫోటోలు వైరల్..
ఇక ఈ సినిమా వైస్సార్సీపీ నాయకులు వేసిన పిటిషన్ ని విచారించిన ఏపీ హైకోర్టు.. నేడు సినిమా ప్రదర్శనకు అనుకూలంగా తీర్పుని ఇచ్చింది. అన్ని ధ్రువపత్రాలు పరిశీలించాకే సీబీఎఫ్సీ సినిమా విడుదలకి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు, ప్రదర్శన ఆపడానికి ఎటువంటి బలమైన కారణం లేదని కోర్టు పేర్కొంది. దీంతో రాజదాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు అడ్డంకులు అన్ని తొలిగిపోయినట్లు అయ్యింది.
కాగా ఈ సినిమాలో మూడు రాజధానుల అంశాన్ని, దాని వల్ల అమరావతి రైతులకు జరిగిన అన్యాయాన్ని చూపించనున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ తో మూవీని తెరకెక్కిస్తున్నప్పటికీ పాత్రల్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తుంది. భాను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, అఖిలన్, వీణ ప్రధాన పాత్రలు పోషించారు. కంఠంనేని రవిశంకర్ ఈ సినిమాని నిర్మించారు.