మా నాన్న ఎన్టీఆర్ అభిమాని.. వారిద్దరితో నాకు ఫోటో ఉంది: సతీష్ వేగేశ్న

శతమానంభవతి సినిమాతో తెలుగు సినిమాలకు కుటుంబ విలువలు, బంధుత్వాలు, బాధ్యతలు, భావోద్వేగాలూ దగ్గర చేసిన ఫ్యామిలీ దర్శకుడు సతీష్ వేగేశ్న. మరోసారి సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధం అయ్యాడు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎంత మంచివాడవురా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం(09 జనవరి 2020) జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరవ్వగా జరిగింది.
ఈ సంధర్భంగా దర్శకుడు సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ.. ‘మన మంచి నందమూరి అభిమానులకు నమస్కారం. నా తల్లిదండ్రులకు, నన్ను రైటర్ని చేసిన ముప్పలనేని శివకి, నన్ను డైరెక్టర్ని చేసిన ఈవీవీకి, అల్లరి నరేశ్కి, నాకు ‘శతమానం భవతి’తో పునర్జన్మను ఇచ్చిన దిల్రాజుకి థ్యాంక్స్.
1963లో సీనియర్ ఎన్టీఆర్కి మా నాన్న పెద్ద అభిమాని. అఖిల భారత ఎన్టీఆర్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. నా దగ్గర ఆ నందమూరి తారకరామారావు గారితో దిగిన ఫోటో ఉంది.. ఈ నందమూరి తారక రామారావు గారితో దిగిన ఫోటో ఉంది. అవి నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేవి.’ అని చెప్పారు.
అలాగే ఒక మనిషికి ఆనందం, బాధ ఒకేసారి రాదు. చాలా అరుదు. నేను అభిమానించే తారక్, నాతో సినిమా చేసిన కళ్యాణ్రామ్ను నేను చేసిన సినిమా ఫంక్షన్కి వచ్చారని ఆనందపడాలో మా నాన్న ఈరోజు లేరని బాధపడాలో తెలియట్లేదు.
ఎన్టీఆర్ మాస్ చేస్తే ‘సింహాద్రి’.. క్లాస్ చేస్తే ‘బృందావనం’.. క్లాస్, మాస్ మిక్స్ చేస్తే ఒక ‘అరవింద సమేత’, ఒక ‘జనతాగ్యారేజ్’. అలాగే నందమూరి కళ్యాణ్రామ్ మాస్ చేస్తే ‘అతనొక్కడే’, క్లాస్ చేస్తే ‘118’, క్లాసు, మాసు కలిపి చేస్తే ‘ఎంతమంచివాడవురా’. సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం.
ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్స్. ఈ సినిమాను 72 రోజుల్లో పూర్తి చేయడానికి కారణమైన నా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ రక్తం చిందించి సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నామని అన్నారు.