Guppedantha Manasu Serial : వసుధర మెడలో తాళి కట్టమన్న జగతి.. రిషి ఏం చేస్తాడు? ఉత్కంఠ రేపిన ఎపిసోడ్
ఆసుపత్రి బెడ్పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న జగతి కళ్లు తెరుస్తుంది. అమ్మా అని పిలిచిన రిషిని చూసి భావోద్వేగానికి గురవుతుంది. రిషిని ఓ కోరిక కోరుతుంది. రిషి నెరవేరుస్తాడా?
- Lakshmi 10tv
- Published On : September 29, 2023 / 11:45 AM IST
Guppedantha Manasu Serial
Guppedantha Manasu Serial : జగతి పరిస్థితి క్రిటికల్గానే ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని రిషి ఇంటికి వెళ్లమని పంపిస్తాడు. రిషికి ధైర్యంగా ఉండమని చెప్పి వారంతా వెళ్తారు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో ఆ తరువాత ఏం జరిగిందంటే?
ఆసుపత్రిలో అందరూ వెళ్లిపోగా రిషి, వసుధర, మహేంద్ర ఉంటారు. వసుధర రిషిని, మహేంద్రని భోజనం చేయమంటుంది. జగతి ఆరోగ్యం స్థిమిత పడేవరకు తాము ఏమీ తినలేమని చెప్పిన వారికి ధైర్యం చెప్పి భోజనం పెడుతుంది. జగతి పట్ల తాను కఠినంగా వ్యవహరించానని వసుధర బాధపడుతుంది. రిషి భోజనం ముగించి తల్లిని చూడటానికి రూమ్ లోకి వెళ్తాడు.
జగతి చేతుల్లో చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టుకుంటాడు రిషి. తాను చేసిన తప్పులకి క్షమాపణ చెబుతాడు. చలనం లేకుండా పడుకుంటే ఎలా అమ్మా.. అంటూ ఆవేదనగా తల్లిని ప్రశ్నిస్తాడు. . అంతలో అక్కడికి వచ్చిన డాక్టర్ ‘మీరు ఆమెకు ఏమవుతారు’ అని ప్రశ్నిస్తాడు. జగతి తన కన్నతల్లి అని చెబుతాడు రిషి. గతంలో కూడా ఆమె శరీరంలో బుల్లెట్ ఉందని.. కానీ ఇప్పుడు దిగిన బుల్లెట్ హార్ట్కి దగ్గరగా ఉండటంతో ప్రాణాపాయం ఏర్పడిందని డాక్టర్ చెబుతాడు. పేషెంట్ దగ్గర ఎవరూ ఎక్కువసేపు ఉండొద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర, వసుధర, రిషి రూమ్ నుంచి బయటకు వెళ్లేంతలో జగతి కళ్లు తెరిచి రిషిని పిలుస్తుంది. అంతా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు.
రిషి, వసుధర, మహేంద్ర కళ్లు తెరిచిన జగతిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురవుతారు. రిషి అమ్మా అని పిలిచిన పిలుపుకి జగతి ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది. మహేంద్రని పిలిచి ‘నా బిడ్డ నన్ను అమ్మా అని పిలిచాడు చూడు’ అని చెబుతుంది. మహేంద్ర కన్నీరు పెట్టుకుంటాడు. నీకోసం ఏదైనా చేస్తాను చెప్పమ్మా అంటాడు రిషి. జగతి తన దగ్గర ఉన్న నల్లపూసల దండ తీసి చూపిస్తూ వసుధరని, నిన్ను భార్యాభర్తలుగా చూడాలని ఆశపడుతున్నాను అంటుంది. జగతి కోరిన కోరికను రిషి నెరవేరుస్తాడా? వసుధర మెడలో నల్లపూసలు వేస్తాడా? తరువాత ఎపిసోడ్లో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ను కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.
