Kotabommali PS Review : కోట బొమ్మాళి పిఎస్ మూవీ ఎలా ఉంది..?
కోట బొమ్మాళి పిఎస్ మూవీ ఎలా ఉంది..? ఎన్నికల సమయంలో పాలిటిక్స్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుందా..?
Kotabommali PS Review : ప్రస్తుతం చిన్న సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్న గీతా ఆర్ట్స్ 2 సంస్థ.. తాజాగా ‘కోట బొమ్మాళి పిఎస్’ అనే ఓ కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, మురళీశర్మ, పవన్ తేజ్ కొణిదెల తదితరులు కీలక పాత్రలు చేశారు. ‘లింగిడి’ సాంగ్ తో ఆడియన్స్ లోకి వెళ్లిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో మూవీ పై ఆసక్తిని కలుగజేసింది.
కథ విషయానికొస్తే..
ఆంధ్రప్రదేశ్లోని టెక్కలి ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల చుట్టూ ఈ సినిమా కథ రన్ అవుతుంది. ఈ ఉపఎన్నికలను అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అయితే ఆ సమయంలోనే కోటబొమ్మాళి పీఎస్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ (శ్రీకాంత్), కొత్త కానిస్టేబుల్ రవి (రాహుల్ విజయ్), మహిళా కానిస్టేబుల్ కుమారి (శివాని రాజశేఖర్) పెళ్ళికి వెళ్లి వస్తూ వాహనం అదుపుతప్పి యాక్సిడెంట్ కి గురవుతారు. ఆ యాక్సిడెంట్ లో మరో వ్యక్తి మరణానికి కారణం అవుతారు.
ఆ వ్యక్తి టెక్కలి నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు కలిగిన సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం అధికార పార్టీకి సమస్యగా మారుతుంది. ఇక ఈ సామజిక వర్గానికి చెందిన యువనేత మున్నా (పవన్ తేజ్ కొణిదెల) ఆల్రెడీ శ్రీకాంత్ అండ్ కోతో వైరం ఉంటుంది. దీంతో ఈ విషయాన్ని రాజకీయం చేస్తూ పెద్ద సమస్యగా మారుస్తాడు. దీంతో అధికార పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇది సమస్య కాకూడదని ముగ్గురు కానిస్టేబుల్స్ పై అరెస్ట్ వారంట్ ఇష్యూ చేస్తారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే అంచనా వేసిన శ్రీకాంత్.. మిగిలిన ఇద్దర్ని తీసుకోని పరారీ అవుతారు.
ఇక వీరి ముగ్గుర్ని 48 గంటల్లో పట్టుకోవాలని ప్రభుత్వం రజియా అలీ (వరలక్ష్మీ శరత్ కుమార్) అనే ఎస్పీని రంగంలోకి దించుతుంది. ఈ యుద్ధంలో వరలక్ష్మీ, శ్రీకాంత్ మధ్య జరిగే ఎత్తులు పై ఎత్తులు ఆడియన్స్ ని థియేటర్స్ లో ఏమవుతుందని టెన్షన్ పడేలా చేస్తుంది. మరి చివరికి ఏమైంది. ఈ పోరులో ఎవరు గెలిచారు అనేది తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ..
ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయనాయకులు చేసే పనులు, కులమతాల ఉపయోగించుకుని చేసే మోసాలు, ఈమద్యలో పోలీసులు ఎదుర్కొనే సమస్యలో చూపిస్తూ వాస్తవానికి చాలా దగ్గరగా ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ నడుస్తుంది. ఈ సమయంలో ఇలాంటి ఒక సినిమా ప్రజలని ఆలోచించేలా చేస్తుంది.
సినిమా మొత్తం ఇంటరెస్టింగా, ట్విస్ట్ లతో ఆద్యాంతంగా ఆసక్తిగానే సాగింది. సినిమా చూస్తునంతసేపు ఆడియన్స్ కోటబొమ్మాళి ప్రపంచంలోనే ఉండేలా చేశారు మేకర్స్. సెకండ్ లో వచ్చే కొన్ని రెగ్యులర్ సెంటిమెంట్ సీన్స్ మాత్రమే ఆడియన్స్ ని కొంచెం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. అలాగే సినిమా ఎండింగ్ తెలుగు నేటివిటీకి కొంచెం బిన్నంగా ఉంటుంది. ఇక చివరిలో కోర్టు రూంలో జరిగే డ్రామా థ్రిల్లింగ్గా ఉంటుంది.
నటీనటుల విషయానికి వస్తే..
శ్రీకాంత్ చాలాకాలం తరువాత ఒక బలమైన పాత్రలో కనిపించారు. మొదటిలో ఒక సామాన్య కానిస్టేబుల్లా కనిపించిన శ్రీకాంత్ సెటిల్డ్గా హీరోయిజం పండించే పాత్రలో నటించి మెప్పించారు. అలాగే ఒక తండ్రిగా కూతురు కోసం తాపత్రయ పడుతూ అందర్నీ కంటతడి పెట్టించారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కూడా తమ నటనతో ఆడియన్స్ ని మెప్పించారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తన బాడీ లాంగ్వేజ్ తో ఆ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జీవించేశారు. మురళీశర్మ, పవన్ తేజ్ కొణిదెల, తదితరులు కూడా వారివారి పాత్రల్లో మెప్పించారు.
విశ్లేషణ..
దర్శకుడు తేజ మార్ని సినిమాని ఆద్యంతం చాలా ఇంటరెస్టింగ్ నడిపించారు. రీమేక్ చిత్రం అయినా దానిని తెలుగు నేటివిటీకి తగ్గట్టు అడాప్ట్ చేసిన పద్ధతి టాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఇక మిగిలిన టెక్నికల్ అంశాలు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే ఎక్కడా హద్దులు దాటకుండా ఎన్నికల సమయంలో ఒక మంచి మెసేజ్ ని ఇచ్చేలా ఈ సినిమాని తెరకెక్కించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఈ సమయంలో ఆడియన్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా. మొత్తంగా ఈ సినిమాకి త్రీ స్టార్ రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ, రేటింగ్ వీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.