ఫేస్‌బుక్‌లో నటితో పరిచయం: మోసం చేసిందంటున్న విశాఖ యువకుడు

  • Published By: vamsi ,Published On : December 26, 2019 / 04:10 AM IST
ఫేస్‌బుక్‌లో నటితో పరిచయం: మోసం చేసిందంటున్న విశాఖ యువకుడు

Updated On : December 26, 2019 / 4:10 AM IST

ఫేస్‌బుక్‌లో పరిచయమైన నటి తనను మోసగించిందంటూ విశాఖకు చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖకు చెందిన పద్మరాజు రవికుమార్ అనే యువకుడికి ఒడియాకు చెందిన నటి చిన్మయి ప్రియదర్శిని పరిచయం అయ్యింది. అయితే పరిచయం ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరకు మోసం చేసిందని వాపోతున్నాడు యువకుడు పద్మరాజు.

ఇదిలా ఉంటే నటి చిన్మయి ప్రియదర్శిని వెర్షన్ మరోలా ఉంది. పద్మరాజే తనను మోసం చేశాడని, తన దగ్గర డబ్బులు తీసుకుని రివర్స్‌లో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని నటి ఆరోపించింది. దీంతో ఇద్దరిలో అసలు మోసం చేశారనే విషయంపై విచారణ చేపట్టేందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. తన దగ్గర నుంచి రూ.2లక్షలు నగదు, ఒక ల్యాప్‌టాప్, బంగారు గొలుసును ప్రియదర్శిని తీసుకున్నట్లుగా చెబుతున్నాడు పద్మరాజు.

మరోవైపు ఈ వ్యవహారంపై నటి చిన్మయ ప్రియదర్శిని భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడారు. పద్మరాజు రవికుమార్ ఫేస్‌బుక్‌లో పరిచయమైన మాట నిజమేనని, అభిమానిని అని చెప్పి భువనేశ్వర్ రాగా అతిథి మర్యాదలు కూడా చేసినట్టు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పడంతో తానే రూ.1.50లక్షలు డబ్బును అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు. అందులో రూ.50వేలు తిరిగిచ్చిన రవికుమార్ మిగతా డబ్బు ఇవ్వలేదని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోగా తనపైనే ఆరోపణలు చేస్తున్నట్లు నటి చెప్పింది. 

అయితే తాను ప్రియదర్శిని వద్ద అప్పు తీసుకుంటున్నట్టు ఆమె చెప్పడం పచ్చి అబద్దం అంటున్నారు పద్మ రాజు. తనతో రాజీ కుదుర్చుకునేందుకు ఓ స్నేహితుడి ద్వారా ప్రియదర్శిని కబురు కూడా పంపిందని చెప్పుకొచ్చాడు.