Singer Janaki : సింగర్ జానకమ్మ కన్నుమూత.. పద్మ అవార్డుపై ఆమె వివాదం తెలుసా? అవార్డు తిరస్కరించి..
జానకమ్మ ఆ అవార్డును తిరస్కరించారు. (Singer Janaki)
Singer Janaki
Singer Janaki : భారత సినీ సంగీత పరిశ్రమలో నేడు విషాదం నెలకొంది. దాదాపు 6 దశాబ్దాలుగా తన పాటలతో దేశ ప్రజలను మెప్పించిన లెజెండరీ సింగర్ జానకమ్మ నేడు కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో పాటు వయోభారంతో ఇబ్బంది పడుతున్న జానకి 88 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మైసూర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.
జానకమ్మ మరణంతో సినీ, రాజకీయ, అన్ని రంగాల ప్రముఖులు, ఆమె అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె పాటలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. సింగర్ జానకి పలు రాష్ట్రాలలో ఆమె పాడిన పాటలకు ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ అవార్డులను గెలుచుకుంది. 2013లో అప్పటి కేంద్రప్రభుత్వం సింగర్ జానకికి దేశ అత్యున్నత మూడో పురస్కారం అయిన పద్మ భూషణ్ అవార్డును ప్రకటించారు. కానీ జానకమ్మ ఆ అవార్డును తిరస్కరించారు.
Also Read : S Janaki : మూగబోయిన జానకమ్మ.. లెజెండరీ గాయని కన్నుమూత..
ఆ సమయంలో జానకమ్మ కేరళలో ఓ వివాహానికి వెళ్లగా అక్కడే ఈ అవార్డుపై మీడియాతో మాట్లాడారు. గాయని జానకి పద్మ అవార్డుపై స్పందిస్తూ.. నేను పద్మ అవార్డుని తిరస్కరిస్తున్నాను. గత 55 ఏళ్లుగా నేను ఎన్నో భాషల్లో పాడాను. ఆ భాషలలోని అభిమానుల గుర్తింపుని నేను అత్యున్నత పురస్కారంగా భావిస్తున్నాను. వారంతా నా పాటలను మెచ్చుకున్నారు. మలయాళీలు కూడా నా ఉచ్చారణ చాలా బాగుందని చెప్పారు. అంతకంటే ఏం కావాలి. ప్రభుత్వంపై నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు. ప్రభుత్వం ఏ తప్పు చేసిందని నేను అనుకోవడం లేదు అని అన్నారు.
అయితే తర్వాత ఓ ఇంటర్వ్యూలో.. ఉత్తర భారత కళాకారులకు, దక్షిణ భారత కళాకారులకు వ్యత్యాసం చూపిస్తున్నారు. అవార్డు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. నేను సంగీత రంగానికి ఎంతో చేశాను. కానీ నేను పద్మ పురస్కారాన్ని తిరస్కరించాలని నిర్ణయించుకున్నాను. నేను భారతరత్నకు అర్హురాలినని జానకమ్మ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
Also Read : Meher Ramesh : ఫ్లాప్ డైరెక్టర్ మళ్ళీ నటుడిగా మారుతున్నారా? మహేష్ బాబు సినిమా తర్వాత..
జానకి తనయుడు మురళీకృష్ణ ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ అవార్డు చాలా ఆలస్యంగా వచ్చింది. ఆమెకు ఇది ఎప్పుడో రావాల్సింది. అందుకే ఆమె ఈ పురస్కారాన్ని గౌరవపూర్వకంగా స్వీకరించడానికి నిరాకరించారు. ఆమెకు పురస్కారం ఇస్తున్న విషయం కూడా మాకు ముందే చెప్పలేదు. ఇలా ప్రకటనల ద్వారానే తెలుసుకున్నాము అని తెలిపారు. అప్పట్లో గాయని జానకమ్మ ఈ పద్మ భూషణ్ అవార్డుని తిరస్కరించడం సంచలనంగా మారింది.
