అధికారపార్టీకి 12మంది ఎమ్మెల్యేలు రాజీనామా!

దేశవ్యాప్తంగా పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్రంలోని బీజేపీకి గట్టి షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్లో ఆ పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాష్ట్రంలోని మొత్తం 15మంది లీడర్లు రాజీనామా చేయగా.. అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. వీరంతా నేషనల్ పీపుల్స్ పార్టీ(NPP)లో చేరారు. టికెట్లు ఆశించి భంగపడిన వీరు తిరుగుబాటు చేశారు. తమకు టికెట్ నిరాకరించడంతో వీరంతా పార్టీ మారారు. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న అరుణాచల్ప్రదేశ్లో ప్రేమ్ ఖండు నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది.
అయితే హోంమంత్రి కుమార్ వైయి, పర్యాటక శాఖ మంత్రి జర్కర్, మాజీ బీజేపీ ప్రధాన కార్యదర్శి జర్పుమ్ గాంలిన్ బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో సార్వత్రిక ఎన్నికలవేళ బీజేపీకి ఇబ్బంది కలిగినట్లు అయింది. తప్పుడు సిద్ధాంతాలు, అబద్ద ప్రచారాలతో పూర్వ వైభవం బీజేపీ కోల్పోయిందని, ముఖ్యంగా మైనారిటీ వ్యతిరేక విధానాలతో ప్రభుత్వాలను నడుపుతుందని వారు ఆరోపించారు. బీజేపీ అవలంబిస్తున్న ఈ విధానాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అందుకే పార్టీ మారుతున్నట్లు వాళ్లు వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు. అరుణాచల ప్రదేశ్ నేషనల్ పీపుల్స్ పార్టీ ఇన్చార్జ్ థామస్ సంగ్మా సమక్షంలో వీరంతా ఆ పార్టీలో చేరారు. ఈ సంధర్భంగా రాబోయే ఎన్నికల్లో 45 నుండి 50సీట్లతో పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ఎన్పీపీ అధ్యక్షుడు సంగ్మా ఆశాభావం వ్యక్తం చేశారు.