ఉగ్రవాదంపై ఇక యుద్ధమే : అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ – మోదీ

అమెరికా గడ్డపై నుంచి ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కలిసి పని చేస్తామని తెలిపారు. భారత్ను అస్థిరం చేసేందుకు పొరుగుదేశం కుట్రలు పన్నుతోందని మోదీ పాకిస్థాన్పై విరుచుకుపడ్డారు. అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 దాడులు, ముంబైపై జరిగిన నవంబర్ 26 దాడులకు సూత్రధారులు పొరుగుదేశంలో ఉన్నారని మోదీ ఆరోపించారు. 72 ఏళ్లుగా భారత్ను ఇబ్బంది పెట్టిన 370 అధికరణాన్ని రద్దు చేశామని… జమ్మూకశ్మీర్లో అభివృద్ధికి బాటలు వేశామని మోదీ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడిపై ప్రధాని మోదీ పొగడ్తల వర్షం కురిపించారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ హ్యూస్టన్ వేదికగా మోదీ పిలుపునిచ్చారు. ట్రంప్… భారత్కు నిజమైన స్నేహితుడని… హ్యూస్టన్ నుంచి ఈ కొత్త స్నేహగీతం కొనసాగుతుందన్నారు. 60 ఏళ్ల తర్వాత భారత్లో అత్యంత బలమైన ప్రభుత్వం ఏర్పడిందన్నారు మోదీ. ఇదంతా మోదీ ప్రతిభ వల్ల జరిగింది కాదని.. భారతీయుల సంకల్పం వల్లే జరిగిందన్నారు.
సంకల్పం నుంచి సాకారం వరకు… ఇదే భారత్ కొత్త నినాదం అని చెప్పారు. బీజేపీ హయాంలో దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని హ్యూస్టన్ వేదికగా మోదీ ప్రస్తావించారు. 97 శాతం గ్రామాలకు ఐదేళ్లలో రోడ్లు వేశామని… ఐదేళ్లలో 2 లక్షల కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు నిర్మించామన్నారు. గత ఐదేళ్లలో వందశాతం ప్రజలను బ్యాంకులకు అనుసంధానం చేశామని… 37 కోట్ల మందితో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిపించామని మోదీ వివరించారు.
Read More : నమో నినాదాలతో మార్మోగిన హ్యూస్టన్…వేదికపైకి మోడీ