Congress Party: ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలనీ ఆదేశించిన సోనియా గాంధీ
ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి భాద్యత వహిస్తూ రాష్ట్ర అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేయాలనీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించింది.
- Bharath Reddy
- Published On : March 15, 2022 / 08:58 PM IST
Congress Party
Congress Party: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం చెందడంపై పార్టీ జాతీయ అధిష్టానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలపై కనీస పోటీ కూడా ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీలో అంతర్మధనం మొదలైంది. ఈక్రమంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి భాద్యత వహిస్తూ రాష్ట్ర అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేయాలనీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షులను రాజీనామాలు చేయాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశించారు. రాష్ట్ర శాఖలలో పదవుల పునర్వ్యవస్థీకరణ చేసి కొత్తవారికి పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు అధినేత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Also read: AP Cabinet: మంత్రివర్గ విస్తరణపై తొలగిన ఉత్కంఠ
ఈమేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా మంగళవారం సాయంత్రం ఒక ట్వీట్ చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం మార్చి 13న సోనియా అధ్యక్షతన నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో విధాన పరమైన మార్పులు సహా.. ప్రజల్లో పార్టీని ఏ విధంగా తీసుకువెళ్లాలి అనే అంశంపై మల్లగుల్లాలు పడుతుంది. ఎన్నికల్లో ఘోర వైఫల్యం అనంతరం ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ అధిష్టానం.. 23 మంది సీనియర్ నేతల బృందంతో సమావేశం అయింది. పార్టీలోని అసమ్మతివాదులు, పార్టీ నాయకత్వ పనితీరుతో విసుగు చెంది ఉన్నట్లు అధినేత్రి దృష్టికి తీసుకువచ్చారు.
Also read: Sonia Gandhi: సిద్దూ రాజీనామా చేసేయ్ – సోనియా గాంధీ
అయితే సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ నేతలకు బాధ్యతలను ఖరారు చేయాలని అధిష్టానానికి సూచించారు. ఇదిలాఉంటే ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ గణేష్ గొడియాల్, గోవా కాంగ్రెస్ చీఫ్ గిరీష్ చోడంకర్ ఇప్పటికే రాజీనామా చేయగా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ నమీరక్పామ్ లోకేన్సింగ్లు రాజీనామా చేయనున్నారు. ఎన్నికల్లో పార్టీ పేలవమైన పనితీరుపై సమీక్షలు కొనసాగుతున్నాయి.
Also read: Power Bills : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే
