CM Himanta Biswa Sharma: మహిళలు గర్భందాల్చడానికి సరైన వయస్సు అదేనట.. అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు
మైనర్లను పెళ్లిచేసుకున్న వేలమందిని రాబోయే ఐదారు నెలల్లో అరెస్టులు చేయిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకుని భర్తలైనవారిని వదిలిపెట్టేది లేదని గువాహటిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పష్టంచేశారు.
- Harishth Thanniru
- Published On : January 29, 2023 / 09:16 AM IST
Assam Cm
CM Himanta Biswa Sharma: మహిళలు పెళ్లి చేసుకొనే వయస్సు, ఏ వయస్సు నుంచి ఏ వయస్సు వరకు గర్భం దాల్చాలో అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ తెలిపారు. గుహవాటిలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తు వివాహాలు, తక్కువ వయస్సులో శిశు జననాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మాతా, శిశు మరణాల రేటు అధికంగా ఉండటానికి కారణాలలో ఒకటి బాల్య వివాహాలేనని సీఎం చెప్పారు. తక్కువ వయస్సులోనే పెళ్లిచేసుకోవటం, గర్భం దాల్చడం వల్ల మహిళలకు, పుట్టబోయే బిడ్డకు ప్రమాదం తలెత్తుతుందని తెలిపారు.
మైనర్లను పెళ్లిచేసుకున్న వేలమందిని రాబోయే ఐదారు నెలల్లో అరెస్టులు చేయిస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. 14ఏళ్లలోపు బాలికలను పెళ్లిచేసుకొని భర్తలైనవారిని వదిలిపెట్టేంది లేదని సీఎం హెచ్చరించారు. 18ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సున్న యువతులను పెళ్లిచేసుకున్న వారు యావజ్జీవ కారాగార శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు. అయితే, మాతృత్వం పొందడానికి సరియైన వయస్సు ఏదోకూడా సీఎం వెల్లడించారు.
Assam CM : విద్యార్థినిలు హిజాబ్ ధరిస్తే..వారికి పాఠాలు అర్థమయ్యాయో లేదో టీచర్ కి ఎలా తెలుస్తుంది?
ప్రతీదానికి తగిన వయస్సు ఉండేలా దేవుడు మన శరీరాలను రూపొందించాడని, పెళ్లైన మహిళలు 22 నుంచి 30 ఏళ్ల మధ్యలోనే పిల్లలకు జన్మనివ్వాలని, అప్పుడే ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని సీఎం అన్నారు. ఇటీవకాలంలో మహిళలు 30ఏళ్ల తరువాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, అలాంటివి సరియైంది కాదని, పెళ్లిచేసుకొని 30యేళ్ల లోపు బిడ్డలకు జన్మనిచ్చేలా మహిళలు ప్లాన్ చేసుకోవాలని ఆయన సూచించారు. సీఎం వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు 30ఏళ్లలోపు గర్భం దాల్చాలని సూచించే బదులు ఇతర ముఖ్యమైన అంశాల గురించి సీఎం మాట్లాడాలని పలువురు విమర్శించారు. సీఎం లాయర్, డాక్టర్ కాదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కొన్ని అధ్యయనాలు చదవాలని న్యాయవాది, సామాజిక కార్యకర్త పౌలోమి నాగ్ సూచించాడు.
