Assam Four Ec Officials Suspended After Evm Found In Bjp Candidates Car Repoll Ordered
Assam ఓ బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎం దొరకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసోంలో గురువారం రెండో విడత ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే కరీంగంజ్ జిల్లాలోని రతాబరి నియోజకవర్గంలో ఓటింగ్ పూర్తైన తర్వాత ఓ పోలింగ్ కేంద్రం నుంచి ఈవీఎంను బీజేపీ ఎమ్మెల్యే కారులో స్ట్రాంగ్ రూమ్ కి తరలించడం వివాదాస్పదమవుతోంది.
గురువారం రతాబరి పరిధిలోని ఇందిరా ఎంవీ స్కూల్లో 149వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ పూర్తయిన తర్వాత సిబ్బంది బయలుదేరుతుండగా.. ఈసీ కేటాయించిన వాహనం చెడిపోయింది. అప్పటికే రాత్రి 9 గంటల కావడంతో సెక్టార్ ఆఫీసర్కు ప్రిసైడింగ్ అధికారి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఓ ప్రైవేట్ వాహనంలో ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. దాని యజమాని ఎవరు అనేది పరిశీలించకుండా వాహనంలో ఎక్కారు. అయితే, ఆ కారు పథార్కండి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణేందు పాల్ భార్య మధుమితా పాల్ కి చెందినది.
స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఈవీఎంను చేర్చిన వాహానాన్ని బీజేపీ నేత భార్యదిగా గుర్తించిన ప్రతిపక్ష కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు విసరడంతో వారి నుంచి తప్పించుకోడానికి పోలీసులు పరుగులు పెట్టారు. వాహనంపై రాళ్లు రువ్వడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి భారీగా బలగాలను రప్పించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వాహనంలోని సిబ్బందిని పోలీసులు సురక్షితంగా తరలించారు.
ఈ విషయంపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. రాతాబరిలోని పోలింగ్ బూత్ నెంబర్ 149లో రీపోలింగ్ నిర్వహించాలని శుక్రవారం ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఘటనకు బాధ్యులపై నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది.
ఈ ఘటనపై బీజేపీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఎన్నికల్లో బీజేపీ అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనమని మండిపడుతున్నాయి. ఈవీఎంలు బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు పాల్కు చెందిన బొలేరో కారులో వెళ్తున్న వీడియోను ట్విటర్లో షేర్ చేసిన ప్రియాంకగాంధీ.. ఎన్నికల సంఘం దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు