Nitish Kumar
Bihar Govt: బిహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మూడు రోజుల్లో బిహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నెల 19 లేదా 20 తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. బిహార్ సీఎంగా మళ్లీ నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
పట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణస్వీకారానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు నితీశ్ కుమార్ క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. 17వ శాసనసభ రద్దు తీర్మానాన్ని క్యాబినెట్ ఆమోదించనుంది. రేపు గవర్నర్కు నితీశ్ కుమార్ రాజీనామా అందించనున్నారు.
నితీశ్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్ష సమావేశాలు జరుగుతాయి. ఎమ్మెల్యేలు ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకుంటారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ గవర్నర్ అనుమతి కోరనుంది.
మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలనలో ఉన్న రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని అంచనా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏ ఐక్యత, రాజకీయ శక్తి ప్రదర్శన కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
Also Read: India vs South Africa: భారత్కు షాక్.. 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం.. అంతా ఈ బౌలర్ వల్లే..
క్యాబినెట్ ఫార్ములా ఇదే..
క్యాబినెట్ ఏర్పాటు ఫార్ములా ఢిల్లీలో అమిత్ షాతో జరిగిన ఓ సమావేశంలో ఖరారైందని తెలుస్తోంది. క్యాబినెట్లో బీజేపీ నుంచి అధిక శాతం మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది తర్వాత జేడీయూ నుంచి అధిక మందికి మంత్రి పదవులు దక్కుతాయి. కూటమిలోని చిన్నపార్టీల నేతలు కూడా క్యాబినెట్లో ఉండేలా ప్రణాళిక రూపుదిద్దుకుంది. ఎన్డీఏ ‘ఆరుగురు ఎమ్మెల్యేలు-ఒక్క మంత్రి’ ఫార్ములా ఆధారంగా క్యాబినెట్ ప్రణాళిక నిర్ణయించినట్లు తెలిసింది.
మంత్రివర్గంలో బీజేపీకి 15 లేక 16 స్థానాలు, జేడీయూకి 14 స్థానాలు లభించే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 3 స్థానాలు రావచ్చు. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా, రాజ్యసభ సభ్యుడు ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం)కు ఒక్కో స్థానం దక్కే అవకాశం ఉందని సమాచారం.