Bus stop stolen
Bengaluru: బస్టాపుల వద్ద జేబు దొంగలను చూస్తుంటాం. అలాగే, పిల్లలను ఎత్తుకెళ్లేవారిని, సామగ్రిని చోరీ చేసేవారిని గురించి కూడా వింటుంటాం. అయితే, బెంగళూరులో బస్టాప్నే ఎత్తుకెళ్లారు దొంగలు. వారం రోజుల క్రితమే కన్నింగ్హామ్ రోడ్లో ఆ బస్టాపుని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వారు నిర్మించారు. దాదాపు రూ.10 లక్షల ఖర్చు అయింది.
బస్టాపుని దిట్టంగా స్టెయిన్లెస్-స్టీల్ తో చేశారు. దాన్ని ఎలాగైనా దోచుకెళ్లాలని దొంగలు ప్లాన్ వేసుకున్నారు. ఎవరూ లేని సమయంలో చోరీ చేసి తీసుకెళ్లారు. బస్టాప్ ను నిర్మించిన కంపెనీ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ… తాము కాఫీ డేకి దగ్గరలో తాము బస్టాప్ నిర్మించామని, ఆగస్టు 21న దాన్ని ప్రారంభించామని తెలిపారు. ఆగస్టు 28న అది మాయమైపోయిందని చెప్పారు.
బస్టాప్ ను ఉద్దేశపూర్వకంగానే తీసేశారా అని బీబీఎంపీ అధికారులను అడిగామని, తామేం తీయలేదని వారు చెప్పారని వివరించారు. దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. బస్సులు ఎక్కడానికి అక్కడికి వస్తున్నవారు ఎండకు ఎండి, వానకు తడిచిపోతున్నారని ప్రయాణికులు అంటున్నారు. కాగా, దొంగలను పట్టుకోవడానికి పోలీసులు అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బస్టాపులను ఎత్తుకెళ్లిన ఘటనలు గతంలోనూ పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి.