Cabinet reshuffle: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు శాఖ మార్పు.. మోదీ కీలక నిర్ణయం
న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal)కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
- T Venkateshwarlu
- Published On : May 18, 2023 / 10:57 AM IST
Kiren Rijiju
Govt shuffles cabinet: కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పు చోటుచేసుకుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజు (Kiren Rijiju)కు భూవిజ్ఞాన శాఖ (MoES) అప్పగించారు. న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal)కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
అర్జున్ రామ్ మేఘ్వాల్ కేంద్ర సాంస్కృతిక శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగానూ ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనల మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా మార్పులు చేశారని రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, భూవిజ్ఞాన శాఖ సహాయ మంత్రిగా జితేంద్ర సింగ్ కొనసాగుతున్నారు. కిరణ్ రిజిజు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా 2021, జులై 8న బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన 2019 మే నుంచి 2021 జులై వరకు క్రీడాశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
కొన్ని నెలల క్రితం కొలీజియం వ్యవస్థపై రిజిజు ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉండాలన్నారు. అప్పట్లో ఆ ట్వీట్ పై సీజేఐ అభ్యంతరాలు తెలిపారు.
