Mamata Banerjee: యూపీఏ కూటమిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అసలు యూపీఏ కూటమే లేదన్నారు మమతా బెనర్జీ. దేశ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న దీదీ.. ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం అవుతోంది. మహారాష్ట్రలో పర్యటించిన ఆమె.. శరద్ పవార్, శివసేన నేతలతో సమావేశం అయ్యారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ ఇద్దరినీ కలిసేందుకే ముంబై వచ్చానని, కానీ ఉద్ధవ్ని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కలవలేకపోయినట్లు వెల్లడించారు. ఉద్ధవ్ లేకపోవడంతో శివసేన నేతలు ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్తో ఆమె భేటీ అయ్యారు. దేశంలో సాగుతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా బలమైన మార్గం అనుసరించాలని ఆమె అభిప్రాయపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బలమైన ప్రత్యామ్నాయం అవసరమన్నారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. తమ ఆలోచన ఈ రోజు కోసం కాదని, ఎన్నికల కోసమని తెలిపారు. బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడాలనే ఉద్దేశంతోనే మమత తనను కలిసినట్లు తెలిపారు. ఈ అంశంపై తమ మధ్య చాలా సానుకూల చర్చ జరిగిందన్నారు.
అయితే, బలమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ లేదా మరే ఇతర పార్టీనా? అన్న విషయాన్ని మాత్రం శరద్ పవార్ చెప్పలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారు కలిసి వస్తే వారిని స్వాగతిస్తామని తెలిపారు.