Covid Vaccine For Children మరికొద్ది రోజుల్లోనే పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం(జులై-27,2021) ఉదయం పార్లమెంటులో జరిగిన బీజేపీ ఎంపీల సమావేశంలో మోదీ ఈ విషయాన్ని చెప్పారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రకటించారు. వచ్చే నెల నుంచే పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉందని మాండవీయ తెలిపారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సమయంలో పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు రావడం విశేషం.
మరోవైపు 12- 18 ఏళ్ల పిల్లల కోసం జైడస్ కాడిలా సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ సెప్టెంబరు నాటికి ప్రారంభం కానుందని వ్యాక్సిన్లపై నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ అధినేత డాక్టర్ ఎన్కె అరోరా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. జైడస్ ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకోగా అత్యవసర వినియోగ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. పిల్లల కోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కోవాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబరులో వెల్లడికావచ్చని, దీని ప్రకారం సెప్టెంబరు నాటికి వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించవచ్చని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా తెలిపారు