Swiggy Orders: వామ్మో.. స్విగ్గీలో కుకీల కోసమే రూ.47వేలు ఖర్చు చేసిన హైదరాబాదీ.. మరోసారి టాప్ లేపిన బిర్యానీ.. ఇంకా

93 మిలియన్ ఆర్డర్‌లతో బర్గర్లు, పిజ్జాలు కూడా ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.

Swiggy Orders: వామ్మో.. స్విగ్గీలో కుకీల కోసమే రూ.47వేలు ఖర్చు చేసిన హైదరాబాదీ.. మరోసారి టాప్ లేపిన బిర్యానీ.. ఇంకా

Updated On : December 23, 2025 / 5:26 PM IST

Swiggy Orders: స్విగ్గీ 2025 రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఫుడ్ లవర్స్ స్విగ్గీని బాగానే వాడుకున్నారు. అందులో కొన్ని ఆహార పదార్ధాలు తెగ ఆర్డర్ పెట్టారు. హైదరాబాద్ కు చెందిన ఓ కస్టమర్ హైలైట్ గా నిలిచాడు. జస్ట్ కుకీల (65 బాక్సుల డ్రై ప్రూట్) కోసమే అతడు 47వేల 106 రూపాయలు ఖర్చు చేశాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇక, ముంబైకి చెందిన ఒక ఆహార ప్రియుడు ఒక సంవత్సరంలో 3వేల 196 ఫుడ్ ఆర్డర్స్ పెట్టాడు. అంటే.. రోజుకు దాదాపు తొమ్మిది ఆర్డర్లు. ఇది దేశంలోనే అత్యధికం.

ఇక, బిర్యానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఇది వరుసగా 10వ సంవత్సరం. 93 మిలియన్ ఆర్డర్‌లతో బర్గర్లు, పిజ్జాలు కూడా ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ప్రపంచ, ప్రాంతీయ వంటకాలు కూడా గణనీయమైన వృద్ధిని సాధించాయి.

మరోసారి అగ్రస్థానంలో బిర్యానీ..

వరుసగా పదవ సంవత్సరం కూడా భారతదేశంలో అత్యంత ఇష్టమైన వంటకంగా తన కిరీటాన్ని నిలబెట్టుకుంది బిర్యానీ. 2025 సంవత్సరంలో విస్మయానికి గురి చేసే రీతిలో 93 మిలియన్ల బిర్యానీలు ఆర్డర్ చేయబడ్డాయి. ఇది సుమారుగా నిమిషానికి 194 ఆర్డర్లు లేదా ప్రతి సెకనుకు 3.25 బిర్యానీలకు సమానం. చికెన్ బిర్యానీ 57.7 మిలియన్ ఆర్డర్‌లతో ఆధిపత్యం చెలాయించింది. అత్యధిక సంఖ్యలో రిపీటెడ్ కస్టమర్లను కూడా నమోదు చేసింది.

భారతదేశపు అత్యంత ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్స్..

ఇక బిర్యానీ తర్వాత 44.2 మిలియన్ల ఆర్డర్లతో బర్గర్లు రెండో స్థానంలో నిలవగా, 40.1 మిలియన్ల ఆర్డర్లతో పిజ్జాలు వాటి తర్వాతి స్థానంలో ఉన్నాయి. సాంప్రదాయ వంటకాలూ తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. దక్షిణ భారతీయ వంటకాలలో వెజ్ దోశ తిరుగులేని విజేతగా నిలిచింది. 26.2 మిలియన్ల ఆర్డర్లను నమోదు చేసింది.

స్నాక్ టైమ్ (మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు)
స్నాక్ విషయానికి వస్తే.. చికెన్ బర్గర్స్ (6.3 మిలియన్ ఆర్డర్లు), వెజ్ బర్గర్స్ (4.2 మిలియన్లు) ఆధిపత్యం చెలాయించాయి. తర్వాత చికెన్ రోల్స్, వెజ్ పిజ్జాలు, చికెన్ నగ్గెట్స్ ఉన్నాయి. క్లాసిక్ చాయ్-సమోసా కాంబినేషన్ జోరుగా కొనసాగింది. కేవలం స్నాక్స్ సమయాల్లోనే 3.42 మిలియన్ల సమోసాలు, 2.9 మిలియన్ల కప్పుల అల్లం చాయ్ ఆర్డర్లు వచ్చాయి.

డెజర్ట్‌లు, ఐస్ క్రీములు..

2025లో డెజర్ట్స్ విషయానికి వస్తే.. వైట్ చాక్లెట్ కేక్ 6.9 మిలియన్ ఆర్డర్‌లతో అగ్రస్థానంలో ఉంది. సాంప్రదాయ స్వీట్లు బలమైన కమ్ బ్యాక్ చేశాయి. గులాబ్ జామున్ (4.5 మిలియన్ ఆర్డర్‌లు), కాజు బర్ఫీ, బేసన్ లడ్డూ ప్రముఖంగా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ లో చాక్లెట్ ఫ్లేవర్ టాప్ లో నిలిచింది. డార్క్ చాక్లెట్ ఐస్ క్రీంలు (3.3 మిలియన్లు), చాక్లెట్ సండేలు (2.6 మిలియన్లు) చార్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి.

గ్లోబల్ ఫ్లేవర్స్, రీజనల్ క్యూజిన్స్ లో పెరుగుదల..
భారతీయ వినియోగదారులు గ్లోబల్ టేస్ట్ లు చూశారు. వారు బాగా ఇష్టపడిన వాటిలో మెక్సికన్ (16 మిలియన్ ఆర్డర్లు), టిబెటన్ (12 మిలియన్+), కొరియన్ వంటకాలు (4.7 మిలియన్లు) ప్రజాదరణ పొందాయి.

అదే సమయంలో స్థానిక వంటకాలకు కూడా భారీగా డిమాండ్ కనిపించింది. మలబారీ, రాజస్థానీ, మాల్వానీ వంటకాల ఆర్డర్లు రెట్టింపు అయ్యాయి. స్థానిక ప్రామాణికతపై పెరుగుతున్న అభిమానాన్ని ఇది హైలైట్ చేస్తుంది. ఇక డిన్నర్ కు తిరుగులేదు. 32శాతం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి.

స్విగ్గీ 99స్టోర్‌లో బెంగళూరు అత్యధిక ఆర్డర్ వాల్యూమ్‌లను నమోదు చేసింది. తర్వాత హైదరాబాద్, ముంబై ఉన్నాయి. ఇండోర్, వైజాగ్, కొచ్చి వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కూడా బలమైన ఆకర్షణను పొందింది. డెజర్ట్‌లలో చాక్లెట్ పేస్ట్రీలు 2.3 లక్షల ఆర్డర్‌లతో అగ్రస్థానంలో ఉండగా, చాక్లెట్ కేకులు 1.3 లక్షల ఆర్డర్‌లతో తరువాతి స్థానంలో ఉన్నాయి. ప్రజాదరణ పొందిన చికెన్ బిర్యానీని.. పనీర్ పిజ్జాలు, కార్న్ గార్లిక్ బ్రెడ్, చికెన్ ఫ్రై క్రాస్ చేశాయి. 99స్టోర్‌లో అత్యంత తరచుగా ఆర్డర్ చేయబడిన వంటకాలలో ఇవి స్థానం పొందాయి.

బ్రేక్‌ఫాస్ట్ టు మిడ్‌నైట్ బింజెస్
11 మిలియన్ ఆర్డర్‌లతో భారతదేశంలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్‌గా ఇడ్లీ నిలిచింది. ఆ తర్వాత వెజ్ దోస (9.6 మిలియన్లు) ఉంది.
ఇక రాత్రిపూట తినాలనే కోరిక (12 AM-2 AM) విషయానికి వస్తే.. చికెన్ బర్గర్‌లు, చికెన్ బిర్యానీ, వెజ్ పిజ్జాలు ఆధిపత్యం చెలాయించాయి. చాక్లెట్ వాఫిల్స్, చాక్లెట్ కేకులు, వైట్ చాక్లెట్ కేక్‌లు అర్థరాత్రి తినడానికి అత్యధికంగా ఆర్డర్ చేయబడిన డెజర్ట్‌లుగా ఉన్నాయి.

ఏడాది పొడవునా ఆహార వినియోగంలో భారీ పెరుగుదలకు పండుగలు కారణమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా 2.28 లక్షల మోదకాలు ఆర్డర్ చేయబడ్డాయి. నవరాత్రుల సమయంలో ఒక లక్షకు పైగా వ్రత థాలీలు, 99వేల 200 ప్లేట్ల సగ్గు బియ్యం కిచిడీ ఆర్డర్ చేయబడ్డాయి. అష్టమి సాయంత్రం, కేవలం ఒక గంటలోనే 2.2 లక్షల ఆర్డర్లు వచ్చాయి. దీపావళి వారంలో 1.7 మిలియన్ కిలోల స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, డెజర్ట్‌లు ఆర్డర్ చేయబడ్డాయి.

Also Read: ఏది పట్టుకున్నా బంగారమే, ఇక డబ్బే డబ్బు..! 2026లో ఈ రాశులకి అఖండ రాజయోగం..!