Indian Student Death: నవీన్ కుటుంబాన్ని ఆదుకుంటామన్న కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
నవీన్ లేని లోటు తీర్చలేనిదని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.
- Bharath Reddy
- Published On : March 1, 2022 / 07:13 PM IST
Bommai
Indian Student Death: యుక్రెయిన్ పై రష్యా తలపెట్టిన యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. యుక్రెయిన్ నగరాలు అక్రమణే లక్ష్యంగా రష్యా జరుపుతున్న భీకర దాడుల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. మంగళవారం ఖార్కివ్ నగరంలో రష్యా జరిపిన బాంబు దాడిలో భారతీయ విద్యార్థి నవీన్ మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాకు చెందిన నవీన్ శేఖరప్ప అనే 21 ఏళ్ల భారతీయ విద్యార్థి ఖార్కివ్ లో నాలుగో ఏడాది మెడిసిన్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం నగదు మార్పిడి చేసుకుని భోజనం తీసుకుని తిరిగి తన బంకర్ కు వెళ్తున్న నవీన్, రష్యా సైనికులు జరిపిన బాంబు దాడిలో మృతి చెందాడు. యుక్రెయిన్ లోని భారత విదేశాంగశాఖ అధికారులు ఈ విషయాన్ని నవీన్ తల్లిదండ్రులకు తెలియజేశారు.
Also read: Ukraine Soldiers: రష్యా భీకర దాడులు.. 70మంది యుక్రెయిన్ సైనికులు మృతి
నవీన్ మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. నవీన్ కుటుంబ సబ్యులకు సంఘీభావం తెలిపారు. నవీన్ లేని లోటు తీర్చలేనిదని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. నవీన్ మృతదేహాన్ని తరలించేలా అక్కడి భారత విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం బొమ్మై తెలిపారు. యుక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపులో కేంద్ర ప్రభుత్వం తలమునకలై ఉందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని క్షేమంగా భారత్ కు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నట్లు సీఎం తెలిపారు.
Also read: Russia Ukraine War : నాడు జర్మనీ కోసం హిట్లర్… నేడు రష్యా కోసం పుతిన్
కర్ణాటకకు చెందిన విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చేలా ముంబై, ఢిల్లీ ఎయిర్ పోర్టులకు రాష్ట్రం నుంచి ప్రత్యేక అధికారులను పంపినట్లు సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. మరోవైపు..నవీన్ మృతిపై అతని తండ్రి జ్ఞానగౌడర్ స్పందిస్తూ..భారత రాయభార కార్యాలయ అధికారుల అలసత్వం కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఖార్కివ్ లో చిక్కుకున్న భారత విద్యార్థులను రక్షించేందుకు ఇండియన్ ఎంబసీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని.. దీంతో దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ బంకర్లలో తలదాచుకున్నట్లు తమ కుమారుడు చెప్పాడని జ్ఞానగౌడర్ పేర్కొన్నాడు.
Also read: Kharkiv: ఖార్కివ్లో దిగజారిన పరిస్థితులు.. భారత్ ఆందోళన
