×
Ad

Bharat Bandh : నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. దేశవ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ను తగలబెట్టేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కరపత్రాలు వదిలారు.

  • Published On : December 22, 2023 / 01:47 PM IST

Maoists Bharat Bandh

Maoists Bharat Bandh : మావోయిస్టులు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. బీహార్, జార్ఖండ్ తోపాటు పలు రాష్ట్రాల్లో విప్లవ ఉద్యమాన్ని కేంద్రం అణిచివేస్తోందన్న మావోయిస్టులు దానిని నిరసిస్తూ ఇవాళ దేశ వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ను తగలబెట్టేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కరపత్రాలు వదిలారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చింతూరు మండలం వీరాపురంలో వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు అటువైపు వాహనాలను అనుమతించడం లేదు. చత్తీస్ గడ్ జగదల్ పూర్ లో కూడా మావోయిస్టులు పలు వాహనాలను తగులబెట్టారు. నాలుగు వాహనాలకు నిప్పు పెట్టగా ఇందులో గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూడా ఉంది.

Maoists : అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

ప్రయాణికులు, డ్రైవర్ ను బస్సు దిగి పోవాలని చెప్పిన మావోయిస్టులు వాహనాలను తగులబెట్టారు. ఇక మావోయిస్టుల బంద్ నేపథ్యంలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దులతో పాటు పలు చోట్ల కూంబింగ్ చేపట్టారు. దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.