జనాభా శాస్త్రం ప్రకారం జనాభా పెరుగుదల రేటు 2.1 కంటే తక్కువగా ఉంటే ప్రమాదకరమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. జనాభా తగ్గుదల కొనసాగితే సమాజం నశించిపోతుందని చెప్పారు.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ‘కథలే కుల్ సమ్మేళనం’లో మోహన్ భగవత్ ప్రసంగించారు. సమాజాన్ని ఎవరూ అంతమొందించాల్సిన అవసరం లేదని, జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉంటే అదే అంతమైపోతుందని తెలిపారు.
అలాగే, భాషలు కూడా కనుమరుగవుతాయని చెప్పారు. ఇండియా జనాభా పాలసీ కూడా ఈ వృద్ధి రేటు 2.1 కన్నా తగ్గకూడదని సూచిస్తోందని తెలిపారు. ఈ రేటు 2 కన్నా ఎక్కువగా, మూడుగా ఉండాలని అన్నారు. ఇది చాలా ముఖ్యమని తెలిపారు.
సమాజ మనుగడకు ఈ విధానం అవసరమని చెప్పారు. అలాగే, వర్గాల మధ్య ఉండే జనాభా అసమతుల్యత కూడా భౌగోళిక సరిహద్దులను ప్రభావితం చేస్తుందని, వాటిని విస్మరించరాదని ఆయన అన్నారు. దేశంలోని అన్ని వర్గాల మధ్య ఈ సమతుల్యతను కొనసాగించాల్సిన ప్రాధాన్యం ఉందని తెలిపారు.
జనాభా ఎక్కువైతే భారం ఎక్కువగా పడుతుందన్నది నిజమేనని, అయితే, జనాభాను సరిగ్గా ఉపయోగించుకుంటే, అది ఒక వనరు అవుతుందని అన్నారు. మన దేశం 50 ఏళ్ల తర్వాత ఎంతమందికి ఆహారం అందించి ఆదుకోవచ్చో కూడా ఆలోచించాలని చెప్పారు. జనాభా అసమతుల్యత భౌగోళిక సరిహద్దుల్లో మార్పులకు దారి తీస్తుందని తెలిపారు.
Govt Teachers Transfers : ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్..