అనంత్ అంబానీ పెళ్లి ఎఫెక్ట్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చిన పలు కంపెనీలు.. ఎందుకంటే?
ఈ నెల 15 వరకు ఇంటి నుంచే పనిచేయాలని చెప్పాయి. వివాహ వేదిక సమీపంలోని..
![అనంత్ అంబానీ పెళ్లి ఎఫెక్ట్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చిన పలు కంపెనీలు.. ఎందుకంటే? అనంత్ అంబానీ పెళ్లి ఎఫెక్ట్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చిన పలు కంపెనీలు.. ఎందుకంటే?](https://10tv.in/wp-content/uploads/2024/07/New-Project-3-4.jpg)
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం శుక్రవారం ముంబైలో జరుగుతోంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మొత్తం మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో అక్కడి కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి. నేటి నుంచి ఈ నెల 15 వరకు ఇంటి నుంచే పనిచేయాలని చెప్పాయి. వివాహ వేదిక సమీపంలోని రోడ్లను ఈ మూడు రోజులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అర్ధరాత్రి వరకు ఆయా ఈవెంట్ల కోసం వాడతారు.
ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో దీనిపై స్థానికులు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి చాలా మంది ప్రముఖులు పెళ్లి వేడుకలను వస్తుండడంతో ఈ వేడుకను “పబ్లిక్ ఈవెంట్”గా గుర్తిస్తూ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. పెళ్లి వేడుక వల్ల బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని హోటల్ గదుల అద్దెలు అమాంతం పెరిగిపోయాయి.
కుర్లా ఎంటీఎన్ఎల్ రోడ్డులో లక్ష్మీ టవర్ జంక్షన్ నుంచి ధీరుబాయి అంబానీ స్క్వేర్ అవెన్యూ లేన్-3, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్- డైమండ్ జంక్షన్ మీదుగా హోటల్ ట్రైడెంట్ వరకు వాహనాల రాకపోకలకు ప్రవేశం ఉండదు. ఆయా మార్గాల్లో వెళ్లాల్సిన వాహనాలు వన్ బీకేసీ నుంచి లక్ష్మీ టవర్ జంక్షన్ వద్ద లెఫ్ట్ సైడ్ కు తిరిగి, డైమండ్ గేట్ నంబర్ 8కి వెళ్లాలి.
Also Read: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు