IAS Resign: ప్రభుత్వ అధికారుల మధ్య వివాదాలు రావడం సాధారణ విషయమే.. కానీ అవి రాజీనామా వరకు చేరడమంటే కొద్దిగా ఆలోచించాల్సిన అంశమే.. ఇద్దరు ఐఏఎస్ అధికారుల మధ్య గొడవ.. ఒకరు ఉద్యోగానికి రాజీనామా చేసేవరకు వెళ్ళింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మైసూర్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేస్తున్న శిల్పానాగ్, జిల్లా కలెక్టర్ గా ఉన్న రోహిణి సింధూరికి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది.
ఇక ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై కమిషనర్ శిల్పానాగ్ మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ రోహిణి సింధూరి, విధి నిర్వహణలో అడ్డొస్తుందని ఆరోపించారు. రోహిణి తనను పనిచేసుకోనివ్వడం లేదని ప్రతి పనిలోనూ అడ్డుతగులుతున్నారని వాపోయారు. ఇలాంటి దురంహంకార కలెక్టర్ ఎవరికీ వద్దని, తాను విసిగిపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనను టార్గెట్ చేయడం ఎంతో బాధకలిగిస్తుందని కమిషనర్ అన్నారు.
ఇద్దరు ఐఏఎస్ అధికారినిల మధ్య ఇటువంటి వివాదం తగదని శిల్పానాగ్ అన్నారు. రోహిణి సింధూరి తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశానని ఆమె తెలిపారు. చివరికి ఇక్కడ పనిచేయడం కంటే ఉద్యోగం నుంచి బయటకు రావడం మంచిదని భావించి రాజీనామా చేసినట్లు చెప్పా రు. కాగా 2014 బ్యాచ్ కి చెందిన శిల్పానాగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మైసూర్ కమిషనర్ గా నియమితులయ్యారు. ఇక ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.