జైపూర్కు వచ్చిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సతీమణి.. అలా వచ్చి ఇలా వెళ్లారు.. ఎందుకంటే?
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సతీమణి, యుక్రెయిన్ ఫస్ట్ లేడీ ఒలీనా వొలోడిమిరివ్నా జెలెన్స్కా జైపూర్కు వచ్చారు.

Ukrainian First Lady
Ukrainian First Lady: యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సతీమణి, యుక్రెయిన్ ఫస్ట్లేడీ ఒలీనా వొలోడిమిరివ్నా జెలెన్స్కా (Olena Volodymyrivna Zelenska) జైపూర్కు వచ్చారు. ఢిల్లీలో ఉన్న యుక్రెయిన్ దౌత్య కార్యాలయ సిబ్బంది ఆమెను కలిశారు. యుక్రెయిన్, రష్యా దేశాల మధ్య కొన్ని సంవత్సరాలుగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో జెలెన్స్కీ సతీమణి జైపూర్ ఎందుకొచ్చింది.. ఆమె జైపూర్లో ల్యాండ్ కాగానే యుక్రెయిన్ దౌత్య కార్యాలయ సిబ్బంది ఆమెను ఎందుకు కలిశారు..? అసలేం జరుగుతుంది..? ఆ విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.
యుక్రెయిన్ ఫస్ట్ లేడీ ఒలీనా వొలోడిమిరివ్నా జెలెన్స్కా మంగళవారం జైపూర్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడి విమానాశ్రయంలో సుమారు రెండు గంటల పాటు ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని నిలిపారు. ఆ సమయంలో జెలెన్స్కీ సతీమణి విమానాశ్రయంలోని వీఐపీ ల్యాంజ్లో వెయిట్ చేశారు. ఢిల్లీలో ఉన్న యుక్రెయిన్ దౌత్య కార్యాలయ సిబ్బంది ఆ టైంలో అక్కడికి వచ్చి ఆమెను కలిశారు.
ఒలీనా వొలోడిమిరివ్నా జెలెన్స్కా జపాన్ టూర్ వెళ్తున్నారు. జపాన్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు యుక్రెయిన్ బృందంతో ఆమె జపాన్లోని టోక్యాకు వెళ్తున్నారు. ఈ బృందంలో 23మంది సభ్యులు ఉన్నారు. ఆ బృందం ప్రయాణిస్తున్న విమానం ఇంధనంకోసం ఉదయం 6.30 గంటల సమయంలో జైపూర్లో ల్యాండ్ అయింది. మళ్లీ ఉదయం 8.15 నిమిషాలకు ఆ విమానం బయలుదేరి వెళ్లింది.
విమానం రీఫుయలింగ్ రిక్వెస్ట్కు భారత విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ ప్రభుత్వ సభ్యులకు అవసరమైన ప్రోటోకాల్ను ఆమోదించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీని ఆదేశించింది. దీంతో చెకింగ్, ఫ్రిస్కింగ్ నుంచి మినహాయింపు కల్పించారు. బృందంలో జెలెన్స్కీ సతీమణితో పాటు యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబియా కూడా ఉన్నారు.